అవమానాలు ఎదురయ్యాయి, తుడుచుకొని వెళ్లాం: కూటమిపై కోదండరాం షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్: తెలంగాణ జన సమితి ఎనిమిది సీట్లలో పోటీలో ఉందని ఆ పార్టీ అధినేత కోదండరాం గురువారం చెప్పారు. పొత్తు నిర్మాణం కోసం టీజేఎస్ గట్టిగా పని చేస్తోందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితోనే కూటమి ఏర్పాటు అని చెప్పారు. కూటమి నిర్మాణంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మేము కూటమి కోసం త్యాగాలు చేశామని చెప్పారు. 14 నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారని, కానీ ఎనిమిది చోట్లనే బరిలో నిలిచామని చెప్పారు. కేసీఆర్ ఈ నాలుగేళ్లలో చేసింది ఏమీ లేదని విమర్శించారు. ప్రజలకు సేవ చేయమని చెబితే ఆయన ఆస్తులు పెంచుకున్నారని చెప్పారు.
చిక్కుల్లో కేటీఆర్: ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్
తాను ఓడిపోతే విశ్రాంతి తీసుకుంటానని కేసీఆర్ వాస్తవమే చెప్పారని ఆన ఎద్దేవా చేశారు. ఆయన గెలిచినా ఫాంహౌసే, గెలవకపోయినా అక్కడే అన్నారు. రేపు మేడ్చల్లో జరగబోయే సోనియా గాంధీ సభలో పాల్గొనాల్సిందిగా తనకు ఆహ్వానం అందిందని చెప్పారు. తెలంగాణలో ఒక పార్టీనే అధికారంలోకి రావటం కష్టమని, హామీల అమలు కోసం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ బాధ్యత తీసుకున్నానని చెప్పారు.
కూటమి ఏర్పాటులో ఎన్ని అవమానాలు ఎదురైనా తుడుచుకుని ముందుకు వెళ్లామని చెప్పారు. కాంగ్రెస్ సర్వేల పేరుతో తమ అభ్యర్థులను చులకన చేసిందని వాపోయారు. కూటమితో టీజేఎస్కు కూడా మేలు జరుగుతుందని ఆశించామని, కానీ తాము ఐదుచోట్ల తప్పుకున్నా కాంగ్రెస్ కనికరం చూపలేదన్నారు. తాను పోటీ చేయకపోవడం తమ మంచికేనని అన్నారు. కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తానని చెప్పారు.