అమరావతికి వెళ్లాలా, వద్దా సాయంత్రం చెప్తాం: కెటిఆర్, బాబుకు కెసిఆర్ ఓకే!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లాలా? వద్దా? అనే విషయమై సాయంత్రం నిర్ణయిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం నాడు ఝలక్ ఇచ్చారు!
మూడు రోజుల క్రితం కెటిఆర్ మాట్లాడుతూ.. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తే తాము వెళ్తామని చెప్పారు. అదే సమయంలో జగన్ తాను ఆహ్వానించినా రానని ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. దీంతో, ఏపీ మంత్రులు కెటిఆర్ బాగా స్పందించారని, అలాంటిది జగన్ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.
కెటిఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను చూపించి జగన్ పైన మండిపడ్డారు. అయితే, మూడు రోజుల క్రితం అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తే వస్తామని చెప్పిన కెటిఆర్.. ఆదివారం సాయంత్రం నిర్ణయిస్తామని చెప్పడం గమనార్హం. అయితే, వెళ్లే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.

కెటిఆర్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇళ్లు (ఐడీహెచ్ కాలనీ) కాలనీ ప్రారంభోత్సవం రోజునే అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ఉందని, దీంతో, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వాయిదా పడవచ్చునని, అయితే అమరావతికి వెళ్లాలా వద్దా అనేది సాయంత్రం నిర్ణయిస్తామని చెప్పారు. కెసిఆర్ అమరావతికి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, సాయంత్రం పూర్తి స్పష్టత వస్తుంది.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కెసిఆర్ అపాయింటుమెంట్ కోరారు. ఆయన ఈ రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు కలవనున్నారు. కెసిఆర్ ఇంటికి వెళ్లి అమరావతి వేడుకకు ఆహ్వానం పలకనున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా కలిసిన తర్వాతనే కెసిఆర్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఈ కారణంగానే సాయంత్రం నిర్ణయిస్తామని కెటిఆర్ వ్యాఖ్యానించారని చెబుతున్నారు. కెసిఆర్ వెళ్తారా? లేక కెసిఆర్ కాకుండా మంత్రి కెటిఆర్ తదితరులు వెళ్తారా అనే విషయమై సాయంత్రం స్పష్టత రానుంది.
అమరావతి శంకుస్థాపన పర్వదినం రోజే హైదరాబాదులో ఐడీహెచ్ కాలనీ ప్రారంభోత్సవం ఉంది. కెసిఆర్... చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతికి వెళ్తే ఐడీహెచ్ కాలనీ (డబుల్ బెడ్ రూం) ప్రారంభోత్సవం వాయిదా పడే అవకాశముంది. కెసిఆర్ కాకుండా కెటిఆర్, ఇతరులు వెళ్తే అదే రోజు ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications