కేసీఆర్! ముందస్తు ఎందుకు? మాదే అధికారం: జానా, ‘కర్ణాటక తరహాలో ప్రభుత్వ ఏర్పాటు’
హైదరాబాద్: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఏ కారణంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తారో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ సవాల్ చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని, తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఎన్ని సీట్లు వస్తాయో మాత్రం చెప్పనని, కర్ణాటక తరహా సర్కార్ ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదని అన్నారు.
టీఆర్ఎస్ నేత డీఎస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే సమాచారం తనకు లేదని చెప్పారు. 'కాంగ్రెస్'లో బీసీలకు అన్యాయం జరుగుతోందన్న దానం నాగేందర్ వ్యాఖ్యలు అబద్ధమని జానా అన్నారు. టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరు సంతృప్తికరంగా ఉందని, పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందనుకోవడం లేదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు.
కేసీఆర్కు వీహెచ్ సూటి ప్రశ్న
Recommended Video
తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. 'దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తున్నావ్ సరే, మరి మాకు(ప్రజలకు) ఇచ్చిన హామీలు అమలు చేయవా?' అని కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్కులు తీర్చుకుంటున్న కేసీఆర్.. ప్రజలకిచ్చిన హామీల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. అసలు ఈ ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్కు ఉందా? లేదా? అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమారే కొనసాగుతారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా చెప్పారని అన్నారు. పార్టీలో ఇంకా కొందరు రహస్య సమావేశాలు పెడుతున్నారని, ఈ విషయమై కుంతియాకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రహస్య సమావేశాల వెనుకున్న కుట్రదారుడు ఎవరో బయటకు రావాలని, పార్టీలో ఇలాంటి చర్యలు సరికాదని వీహెచ్ హితవు పలికారు.