వర్షాలను కొనలేం, ఎవరూ ఉపాయం చెప్పడం లేదు: కెసిఆర్
నిజామాబాద్: హరితహారం పథకంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ నగరంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని పాలిటెక్నిక్ కాలేజీలో మొక్కను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
వర్షాలు రావాలంటే చెట్లను నాటాలని, చెట్లు లేకుంటే వానలు పడవని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది, కానీ వానలను కొని తేలదు కదా! అని అన్నారు. ఎవరికన్నా వర్షాలను కొనే ఉపాయం ఉంటే తనతో చెప్పాలని ఛలోక్తి విసిరారు.
వానలను కొందామంటే ప్రపంచంలో ఎవరూ తనకు ఉపాయం చెప్పడం లేదని అన్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టిన వర్షాలకు కొనలేమని పేర్కొన్నారు. అందుకే చెట్లను నాటి వర్షాలు పడేలా చేసుకుందామని వివరించారు.
ఇకపై తెలంగాణలో కరెంట్ కోతలుండవని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోత నుంచి నిజామాబాద్కు నీళ్లు రప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ తాను డబ్బు ఖర్చు పెట్టి చేయగలనని, వర్షాలను మాత్రం కొనలేమని తెలిపారు. 30 నుంచి 40 ఏళ్లలో నిజామాబాద్ను పూర్వపు నిజామాబాద్లా పచ్చగా చేయగలమన్నారు.
వికలాంగుల కోసం రూ.1500 పెన్షన్ ఇస్తోన్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని తెలిపారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తోన్న ఘనత కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానిదేని వెల్లడించారు.
ప్రభుత్వ హాస్టల్లలో విద్యార్థులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోన్నది కూడా తమ ప్రభుత్వమేనని అన్నారు. తాను సన్న ముఖ్యమంత్రిని కాబట్టి సన్నబియ్యం ఇస్తున్నానని, గతంలో అందరూ దొడ్డు ముఖ్యమంత్రులే కాబట్టి దొడ్డు బియ్యం ఇచ్చారని ఛలోక్తి విసిరారు.