రిస్క్ తీసుకుంటేనే టార్గెట్ రీచ్ అవుతాం: సీఎం రేవంత్
జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంచి నాయకుడిగా ఎదగాలంటే ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు. ఐఎస్బీ (ISB) నిర్వహించిన నాయకత్వ సదస్సు 2024లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్.. లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా అంశంపై ప్రసంగించారు.
ప్రజలతో మమేకం అవ్వగలిగితే ఏదైనా సాధించవచ్చని రేవంత్ చెప్పుకొచ్చారు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు సహా ఎంతో మంది నాయకులు మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. తాను నాయకత్వ లక్షణాలను వారి నుంచే నేర్చుకున్నానని రేవంత్ తెలిపారు.

హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా నిలబెట్టడంలో అందరి సహకారం కావాలని (ISBACON-2024) సదస్సులో సీఎం రేవంత్ కోరారు. దేశంలోని నగరాలతో కాకుండా, న్యూయార్క్, ప్యారిస్, టోక్యో , సియోల్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
ఐఎస్బీ విద్యార్థులు హైదరాబాద్, తెలంగాణతో పాటు న్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లు అని, తెలంగాణను ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యసాధనలో సహకరించాలని, వెళ్లే ప్రతి చోట తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఒక రోల్ మాడల్గా, గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దాలన్నదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.
ఐఎస్బీలో ఉన్నవారంతా తెలంగాణ, దేశానికి అంబాసిడర్లు అని రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల తరహాలో మంచి జీతాలు ఇవ్వలేకపోవచ్చు కానీ, మంచి సవాళ్లు, జీవితానికి సరిపడా నాలెడ్జ్ను మాత్రం అందిస్తుందని సీఎం చెప్పారు.
జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. మంచి నాయకుడిగా ఎదగడంలో ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు. ISB నిర్వహించిన నాయకత్వ సదస్సు (#ISBACON2024) లో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు… pic.twitter.com/51A6X3mYWO
— Telangana CMO (@TelanganaCMO) October 20, 2024
ఒలింపిక్స్లో భారత్ దురదృష్టవశాత్తు స్వర్ణ పతకాలు గెలవలేకపోయిందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు గెలవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. వ్యాపారాల్లో రాణిస్తున్న వారు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications