కోమటిరెడ్డి రౌడీయిజానికి పుల్స్టాప్, ఉప ఎన్నికల్లో 40 వేల మెజారిటీ: జగదీష్ రెడ్డి
హైదరాబాద్: 20 ఏళ్ళుగా నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని, ఈ రౌడీయిజానికి పుల్స్టాప్ పడే సమయం వచ్చిందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.నల్గొండ ఉప ఎన్నికల్లో 40వేల మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో గవర్న్ ప్రసంగం సందర్భంగా హెడ్ ఫోన్ విసిరడంతో నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ మంగళవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు.11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు
అయితే తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాలపై మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం నాడు చిట్ చాట్ చేశారు. . రానున్న రోజుల్లో చోటు చేసుకొనే రాజకీయ పరిణామాలపై జగదీష్ రెడ్డి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.
కోమటిరెడ్డి రౌడీయిజానికి పుల్స్టాప్
నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 20 ఏళ్ళుగా రౌడీయిజం చేస్తున్నారని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. నల్గొండలో ఉప ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రౌడీయిజానికి పుల్స్టాప్ పడే సమయం వచ్చిందని జగదీష్ రెడ్డి చెప్పారు.
ఉప ఎన్నికల్లో 40వేల మెజారిటీ సాధిస్తాం
ఉప ఎన్నికల్లో 40వేల మెజారిటీతో విజయం సాధించనున్నట్టు మంత్రి జగదీష్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు వస్తే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి ఖాయమని మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు. నల్గొండ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
నల్గొండ బరిలో టిఆర్ఎస్ అభ్యర్ధెవరు?
నల్గొండ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా ఎవరిని బరిలోకి దింపుతోందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఇటీవలనే టిడిపి నుండి టిఆర్ఎస్లో చేరిన కంచర్ల భూపాల్రెడ్డికి టిఆర్ఎస్ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ భాధ్యతలను అప్పగించారు. గతంలో ఈ భాద్యతలు దుబ్బాక నరసింహరెడ్డి నిర్వహించేవారు. దుబ్బాక నర్సింహరెడ్డికి కార్పోరేషన్ భాద్యతలను కట్టబెట్టనున్నట్టు మంత్రి కెటిఆర్ హమీ ఇచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ఇండిపెండెంట్గా పోటీచేసిన కంచర్ల భూపాల్ రెడ్డి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ సమయంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో దిగిని దుబ్బాకనరసింహరెడ్డి మూడో స్థానంలో నిలిచారు. దీంతో ఉప ఎన్నికల్లో కంచర్ల భూపాల్ రెడ్డినే టిఆర్ఎస్ అభ్యర్ధిగా నిలిపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నల్గొండలో మార్చి 20న, సభ
టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు గాను మార్చి 20న నల్గొండలో ప్రగతి సభను టిఆర్ఎస్ ఏర్పాటు చేసింది.ఈ సభలోనే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి పేరును ప్రకటించే అవకాశం ఉందని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అభ్యర్ధిని ప్రకటిస్తారా, ఆ లోపుగానే ప్రకటిస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. కానీ, నల్గొండ సభను ఎన్నికల సభగా టిఆర్ఎస్ వినియోగించుకొనే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.