తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు: ఈ జిల్లాలకు అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగానే కొనసాగుతోంది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, సాయంత్రంవేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉరుములు, మెరుపులతో వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో వర్షాలు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని, మరో రెండు రోజుల్లో బలహీనపడే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. అదే సమయంలో దక్షిణ భారతదేశ ద్వీపకల్పం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో వర్షంపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
నేరుతి బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అక్టోబర్ 14 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 48 గంటల్లో ఇది మరింతగా బలపడే సూచనలున్నాయని తెలిపింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలుకురుస్తాయని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications