ఉదయం మరొకరితో పెళ్లి.. రాత్రి ప్రియుడితో చెక్కేద్దామనుకుంది! అంతలోనే కథ కంచికి.. ఇంటికి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. అయితే, ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. అంతేగాక, పెద్దలు కుదర్చిన పెళ్లికి అంగీకరించింది. ఏకంగా పెళ్లి మండపం నుంచి తన ప్రియుడితో చాటింగ్ చేసింది. పెళ్లైన తర్వాత పారిపోదామని అతనికి చెప్పింది. అయితే, ఆ చాటింగ్ విషయం బయటపడటంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
వరుడి గ్రామానికి వధువు కుటుంబసభ్యులు
పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్నగర్ ప్రాంతానికి చెందిన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న యువతికి మహబూబ్నగర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం తలంబ్రాల కార్యక్రమం ఉండటంతో వధువు, ఆమె తరపు బంధువులు శనివారమే వరుడి గ్రామానికి వచ్చారు.
ఫోన్లో ప్రియుడితో వధువు చాటింగ్, స్పీకింగ్..
ఆదివారం ఉదయం పెళ్లి పీటలపై ఉన్న వధువు తరచూ సెల్ఫోన్లో చాటింగ్ చేస్తుండటం, ఎవరితోనో మాట్లాడటం బంధువులు గుర్తించారు. తలంబ్రాలు అనంతరం పెళ్లి మండపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడిని పట్టుకుని అతనికి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత అతడు అసలు విషయం చెప్పాడు.
అసలు విషయం బయటపడింది..
తాను, ఆ యువతి మూడేళ్లుగా ప్రేమించుకున్నామని యువకుడు తెలిపాడు. కాగా, ఆ యువకుడి ఫోన్లో వారిద్దరూ దిగిన ఫొటోలు చూసి బంధువులంతా షాకయ్యారు. దీంతో వధువును, ఆ యువకుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తామిద్దరం ప్రేమించుకున్న విషయం నిజమేనని ఆ యువతి కూడా అంగీకరించింది. పెళ్లి తర్వాత రాత్రికి పారిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇద్దరు ఒప్పుకున్నారు.
పెళ్లి కూతుర్ని వెంబడించిన ప్రియుడు.. చివరకు..
కాగా, ఆ యువకుడు కూడా శనివారమే పెళ్లి కూతురి వాహనం వెనుక బైక్పై వెంబడిస్తూ వచ్చినట్లు చెప్పాడు. ఆదివారం రాత్రి వరకు పోలీస్ స్టేషన్లోనే ఇరువర్గాలతో పోలీసులు విచారణ జరిపారు. అయితే, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. వరుడు, వధువును ఎవరింటికి వారిని పంపించామని, ఆ యువకుడిని కూడా వదిలేశామని చెప్పారు. పెళ్లి పీటల వరకు వచ్చిన వివాహం గంటల ముందే ఆగిపోవడంతో ఇరుకుటుంబాలవారు ఆవేదనకు గురయ్యారు. అప్పటి వరకు ఎంతో వేడుకగా ఉన్న పెళ్లి మండపం ఒక్కసారిగా బోసిపోయింది.