అనురాగ్ శర్మ వారసుడెవరు: హైదరాబాద్ కొత్వాల్ చాన్స్ ఇస్తారా?
ప్రస్తుత డీజీపీ అనురాగ్శర్మ నవంబర్లో రిటైర్ కానున్నారు.డీజీపీ అనురాగ్ శర్మ వారసుడిగా తెలంగాణ నూతన డైడీజీపీ ఎవరు కాబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్: ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ వారసుడిగా తెలంగాణ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా ఎవరు కాబోతున్నారన్నది ఐపీఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న విషయం ఆసక్తి గొలుపుతున్నది. ప్రస్తుతం చర్చలో ఉన్న పేర్లకు బదులుగా చివరి క్షణంలో ఎవరికి సీఎం గ్రీన్ సిగల్ ఇస్తారన్న విషయమై ఐపీఎస్ అధికార వర్గాల్లో చక్కర్లు కొడుతున్న అనుమానాలు.
అయితే కొత్త డీజీపీ ఎంపికకు ఇంకా చాలా సమయం ఉందనుకోండి. అది వేరే సంగతి. సుప్రీంకోర్టు మార్గ దర్శకాల ప్రకారం కొత్త డీజీపీగా నియామకానికి అర్హులైన ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పంపాల్సి ఉంటుంది. ఆ పేర్లలో నుంచి ముగ్గురిని డీజీపీగా ఎంపిక చేసుకోవడానికి యూపీఎస్సీ అనుమతినిస్తే, అందులో నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకుంటుంది.
ప్రస్తుత డీజీపీ అనురాగ్శర్మ నవంబర్లో రిటైర్ కానున్నారు. వాస్తవంగా ఆయన గత ఫిబ్రవరిలోనే పదవీ విరమణ చేయాల్సి ఉన్నా తొమ్మిది నెలలు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఐదు నెలల క్రితమే ఆయన రిటైరైతే కొత్త డీజీపీగా ప్రస్తుత హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎం మహేందర్రెడ్డిని ఆ పదవి వరించనున్నదని ఊహాగానాలు సాగాయి. అనూహ్యంగా అనురాగ్ శర్మ పదవీ కాలం సర్కారు పొడిగించడంతో ఐపీఎస్ వర్గాలు విస్మయానికి గురయ్యాయి.
వరమాల సుదీప్ లక్టాకియా, మహేందర్ రెడ్డిల్లో ఎవరికి?
ఇక నవంబర్లో కొత్త డీజీపీ నియామకం జరగడం ఖాయం కావడంతో తిరిగి ఐపీఎస్ వర్గాలలో వాడిగా వేడిగా చర్చ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ చీఫ్ కావడానికి అర్హులైన వారిలో 1983 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన తేజ్దీప్ మీనన్ (ఎస్పీఎఫ్ డీజీ), 1984 బ్యాచ్కు చెందిన సుదీప్ లక్టాకియా (సీఆర్పీఎఫ్ డీజీపీ), 1985 బ్యాచ్కు చెందిన డాక్టర్ ఈష్కుమార్ (ఎన్సీఆర్బీ డైరెక్టర్), 1986 బ్యాచ్కు చెందిన రాజీవ్ త్రివేది (రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి), ఎం మహేందర్రెడ్డి (హైదరాబాద్ కొత్వాల్), టి. కృష్ణప్రసాద్ (రాష్ట్ర రోడ్ సేఫ్టీ, రైల్వే పోలీస్ డీజీపీ) ఉన్నారు. నిబంధనల ప్రకారం పై ఆర్గురు సీనియర్ ఐపీఎస్ల పేర్లను యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం పంపే అవకాశం ఉన్నది.
Recommended Video
కొత్వాల్ మహేందర్ రెడ్డికే చాన్స్?
శాంతి భద్రతల విభాగం మొదలు వివిధ విభాగాలు, హోదాలలో వీరు నిర్వహించిన విధులు, సాధించిన విజయాలతో పాటు ఏదేని సందర్భంలో వీరిపై వచ్చిన ఆరోపణలు, కేసుల గురించి కూడా వారి ఒక్కొక్కరి సర్వీసు రికార్డులను ఉటంకిస్తూ పంపించనున్నది. వాటన్నింటిని యూపీఎస్సీ సూక్ష్మంగా పరిశీలించి ముగ్గురు అధికారుల్లో ఒకరిని డీజీపీగా నియమించుకోవడానికి అనుమతినిస్తుంది. ఈ ప్రక్రియ ముగియడానికి దాదాపు నెల రోజులపైనే సమయం పడుతుంది. ఇందులో హైదరాబాద్ కొత్వాల్ మహేందర్రెడ్డి పట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిని చూపిస్తున్నదని వినికిడి.
ఆరుగురు ఐపీఎస్ల్లో ఇలా పోటీ ?
ఇతర అధికారుల కంటే ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా, సైబరాబాద్, నగర పోలీసు కమిషనర్గా ఆయనకు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపులో అపారమైన అనుభవం ఉన్నది కాబట్టి ఆయనకే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఐపీఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో సీనియారిటీతో పాటు నిజాయితీ నిబద్థత కల ఐపీఎస్ అధికారిగా ఢిల్లీలో డిప్యూటేషన్పై ఉన్న సీఆర్పీఎఫ్ డీజీపీ సుదీప్ లక్టాకియాకు అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం కూడా వినిపిస్తున్నది. తర్వాత వరుసలో రాజీవ్ త్రివేదీ, కృష్ణప్రసాద్ ఉన్నారని ఐపీఎస్ వర్గాల సమాచారం. కాగా ఇటీవల జరిగిన పోలీసు అధికారుల రాష్ట్ర సదస్సులో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో ఆయనకే డీజీపీ పోస్టు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
క్యాట్ కు వెళ్లే అవకాశం సీఎం కేసీఆర్ ఇస్తారా?
పలు సందర్భాలలో జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం కేసీఆర్ అందరి ఊహాగానాలను బోల్తా కొట్టిస్తూ ఆరుగురు సీనియర్ అధికారుల్లో మిగతా వారిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేసినా ఆశ్చర్య పోనవసరం లేదని పలువురు ఐపీఎస్లు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో తమను కాదని జూనియర్ అధికారిని డీజీపీగా నియమిస్తే ఒకరిద్దరు సీనియర్లు క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యునల్)ను ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు ఐపీఎస్ అధికారుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. తదుపరి డీజీపీ ఎవ్వరన్నది తేలాలంటే సుమారు మరో 45 రోజుల ఉత్కంఠ ఐపీఎస్ వర్గాలకు తప్పనిసరేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.