భార్యాభర్తల పంచాయితీ: భర్త కుటుంబాన్ని విచక్షణారహితంగా కళ్ళల్లో కారం కొట్టి, కత్తులతో నరికి..
భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న గొడవ ప్రాణాలు తీసుకునే దాకా వెళ్ళింది. ఇద్దరు భార్య భర్తల మధ్య వివాదం రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. ఊహించని విధంగా భార్య కుటుంబీకులు భర్త కుటుంబీకులపై కత్తులతో దాడి చేసి విధ్వంసానికి పాల్పడే దాకా వెళ్ళింది. కళ్ళల్లో కారం కొట్టి, కత్తులతో ఊహించని విధంగా జరిగిన దాడిలో ఒక మహిళ మృతి చెందగా, ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్క మంతల పహాడ్ లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే
కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ను హతమార్చిన మావోయిస్టులు.. పోలీస్ ఇన్ఫార్మర్ లకు ఇదేగతి అంటూ లేఖ
భార్యాభర్తల మధ్య పెళ్ళయిన ఏడాది నుండే గొడవలు
నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్క మంతల పహాడ్ కు చెందిన కమతం బిక్షమయ్య, అచ్చమ్మ దంపతులకు కుమారుడు అయిన శివన్నారాయణ కు అదే గ్రామానికి చెందిన జిల్లపల్లి సూర్యనారాయణ, యశోద దంపతుల కుమార్తె అయిన శ్యామలతో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. శివన్నారాయణ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేవాడు. కరోనా మహమ్మారి కారణంగా స్వగ్రామానికి తిరిగివచ్చి శివన్నారాయణ ప్రస్తుతం తమకు ఉన్న 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు.అయితే వివాహమైన ఏడాది నుండి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి.
పంచాయితీలు పెట్టినా చక్కబడని కాపురం .. తాజాగా మరోమారు ఘర్షణ
గతంలో పెద్దమనుషులు పంచాయితీ పెట్టి ఇద్దరికీ సర్దిచెప్పి కలిసి ఉండాలని పంపించారు. అయినప్పటికీ శివన్నారాయణ, శ్యామల దంపతులకు గొడవలు నిత్యకృత్యంగా మారాయి . ఈ క్రమంలో తాజాగా సోమవారం నాడు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మంగళవారం ఉదయం శ్యామల తన తల్లి గారి ఇంటికి ఫోన్ చేసి భార్యాభర్తల మధ్య జరిగిన గొడవను చెప్పి తీవ్రంగా దుఃఖించింది. తరచూ గొడవల నేపథ్యంలో, కుమార్తెను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహంతో ఊగిపోయిన శ్యామల తండ్రి సూర్యనారాయణ, తల్లి యశోద, అన్న శివ శివ నారాయణ ఇంటికి వెళ్లి ఒక్కసారిగా వారిపై విరుచుకు పడ్డారు.
భర్త కుటుంబంపై కళ్ళలో కారం కొట్టి కత్తులతో దాడి చేసిన భార్య కుటుంబీకులు
తమ వెంట తెచ్చుకున్న కారాన్ని కళ్ళల్లో కొట్టి విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు. శివన్నారాయణ అతని తండ్రి బిక్షమయ్య, తల్లి అచ్చమ్మ, అమ్మమ్మ నారమ్మ కళ్ళల్లో కారం కొట్టి కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివన్నారాయణ తల్లి అచ్చమ్మ మృతి చెందగా, మిగతావారంతా తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన ముగ్గురిని మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితులు .. ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి
ఇక అల్లుడు కుటుంబం పై దాడి చేసిన నిందితులు అత్తమామలు సూర్యనారాయణ, యశోద, బావమరిది శివ నిడమనూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవలు చివరికి, రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణం కాగా కత్తులతో దాడి చేసుకునే దాకా వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది. భర్త ఇంటి పై భార్య కుటుంబీకుల దాడిలో ముగ్గురు ఆసుపత్రి పాలు కాగా, ఒకరు మృతి చెందారు. ఇక వారిపై దాడి చేసిన వారు కటకటాల పాలయ్యారు. ప్రస్తుతం భార్య శ్యామల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.