మృత్యువులోనూ నాతిచరామి.. భర్త మరణించిన కాసేపటికే భార్య కూడా..
కామారెడ్డి జిల్లా: ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి అన్న మాటకు ఎంత మందికి అర్ధం తెలుసో తెలియదు కానీ, పెళ్లిలో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఓ భార్యాభర్తలు ఇద్దరూ మృత్యువులోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారు. చావులోనూ కలిసే అనంతలోకాలకు చేరుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని లింగపేట మండలం షెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే..
కామారెడ్డి జిల్లా లింగపేట మండలం షెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో నివాసముంటున్న 61 సంవత్సరాల రాజయ్య అనే వ్యక్తి గుండెపోటుకు గురయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో, ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలోనే గుండె నొప్పి ఎక్కువై రాజయ్య మృత్యువాత పడ్డారు. అయితే భర్త రాజయ్య ఇక లేడు అని తెలిసి తీవ్ర దుఃఖంలో మునిగి పోయిన 54 సంవత్సరాల భార్య లచ్చవ్వ, భర్త కోసం రోదించింది.
భర్త రాజయ్యకు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్న సమయంలో ఆమెకూడా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే రాజవ్వ సైతం ప్రాణాలు విడిచింది. దీంతో చావులోని విడదీయలేని వారి బంధాన్ని గురించి గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. ఇక ఒకేసారి భార్యాభర్తలు ప్రాణాలు వదలడంతో ఇద్దరి మృతదేహాలను ఒకే చోట ఉంచి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఊహించని ఈ విషాదానికి కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
ఇద్దరూ ఒకేసారి మరణించగా, భార్య భర్తలైన రాజయ్య, లచ్చవ్వలకు ఇద్దరికీ కలిపి ఒకేసారి అంత్యక్రియలను నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవారని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయే వారని, ఇప్పుడు చావులోనూ ఇద్దరు కలిసే ప్రయాణం చేశారని ఈ విషయం తెలిసిన వారు చెప్పుకుంటున్నారు. పెళ్లి నాడు చేసిన వాగ్దానానికి కట్టుబడి మరణంలోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆ అన్యోన్య దంపతులు అనంతలోకాలకు వెళ్లిపోయారని చర్చించుకుంటున్నారు. మృత్యువులోనూ వీడని వీరి బంధాన్ని గురించి చెప్పుకుంటున్నారు.