నిత్య పెళ్లి కొడుకంటూ.. భర్త ఇంటి ముందు బైఠాయించి భార్య ఆందోళన
మహిళల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఇంకా మహిళలు గృహ హింసకు గురవుతున్నారు. నిత్యం ఎక్కడో చోట మహిళలు అత్తవారింట్లో వేధింపులతో ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉన్నారు. కట్నం కోసం వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు మహిళలు మౌనంగా వేధింపులు భరిస్తుంటే, మరి కొందరు మహిళలు వేధింపులను భరించలేక పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. ఇంకొందరైతే అత్తగారి ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగుతున్నారు.
తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటువంటి ఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాంతి నగర్ కాలనీలో భర్త ఇంటిముందు ఓ భార్య ఆందోళనకు దిగింది. నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి తో జనవరి నెలలో తనకు పెళ్లి జరిగిందని అప్పటినుండి నాగేంద్రకుమార్ తనను వేధిస్తున్నారంటూ భార్య వెంకటలక్ష్మి ఆందోళన బాట పట్టింది. పెళ్లి చేసుకుని రెండు నెలలైనా గడవకముందే తాను చెప్పినట్టు వినాలి అని, ఆస్తి తీసుకురావాలని భర్త నాగేంద్రకుమార్ తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది.
గతంలో భర్త నాగేంద్ర కుమార్ కు మూడు పెళ్లిళ్లు జరిగాయని, తనను నాలుగో వివాహం చేసుకున్నాడు అంటూ ఆరోపించింది. తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని పేర్కొన్న వెంకటలక్ష్మి తనకు న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించింది. తన భర్త నిత్య పెళ్ళికొడుకు అంటూ ఆరోపించింది, ఇక వెంకటలక్ష్మి చేస్తున్న ఆరోపణలు విన్నవారంతా అప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్న వ్యక్తిని వెంకటలక్ష్మి మళ్లీ నాలుగో పెళ్లి ఎందుకు చేసుకుందంటూ ఆలోచనలో పడ్డారు. నాలుగో పెళ్లి చేసుకున్న నాగేంద్ర కుమార్ ఆమెతో అయినా సక్రమంగా సంసారం చేయక వేధింపులకు గురి చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిత్య పెళ్లి కొడుకంటూ.. భర్త ఇంటి ముందు బైఠాయించి భార్య ఆందోళన#wife pic.twitter.com/WtFAv2T4qu
— oneindiatelugu (@oneindiatelugu) May 11, 2022
ఏదిఏమైనా భర్త ఇంటిముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న వెంకటలక్ష్మి విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంలో ఆందోళన చేస్తున్న భార్య వెంకటలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చెయ్యాల్సింది అంటూ చెప్తున్నారు. మరి భార్య చెప్పేది ఇలా ఉంటే భర్త నాగేంద్ర కుమార్ ఈ వ్యవహారంలో ఏమి చెప్తారో?