ప్రేమించి పెళ్లి: భార్య నగలే దొంగిలించాడు
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు చెందిన బంగారాన్ని, నగదును తస్కరించిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - యూసుఫ్గూడలోని ఎల్ఎన్నగర్లో నివాసముండే గోపిశెట్టి శ్రీజను విజయవాడకు చెందిన ఉమాబాబును 2011 నవంబర్లో పెళ్లి చేసుకున్నాడు.
అప్పటినుంచి శ్రీజ ఆస్తిపై కన్నేసిన ఉమాబాబు జనవరిలో ఆమె ఇంట్లోని 25 తులాల బంగారం, రూ. 15 లక్షల నగదునుతో పాటు ఆమె పేరుతో ఉన్న ఇంటి స్థలం డాక్యుమెంట్లను తీసుకొని ఉడాయించాడు. అప్పటినుంచి భర్త ఉమాబాబు కోసం గాలింపు చేసిన శ్రీజను బెదిరింపులకు గురిచేస్తుండడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తండ్రి నడుపుతున్న బస్సు కిందే పడ్డాడు
తండ్రి నడిపే బస్సు కింద ప్రమాదవశాత్తు పడి కొడుకు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన లొడంగి సాయిలు హుజూర్నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు నడుపుతున్నాడు. గురువారం రాత్రి లక్ష్మీపురంలోని తన ఇంటి పక్కన బస్సును నిలుపుతుండగా, ఆయన కొడుకు సిద్ధార్థ(2) బస్సు దగ్గరకు వస్తూ వెనుక టైరు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
తల్లిని చంపిన తనయుడు
కుటుంబ కలహాలతో మద్యమత్తులో తల్లిదండ్రులపై ఓ కొడుకు దాడి చేశాడు. తల్లి ప్రాణాలు కోల్పోగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నది. నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం వాల్యతండాకు చెందిన బానోతు లాల్య, బానోతు దేవి(40) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు బానోతు వీరన్న ఉన్నారు. అందరికి పెండ్లిళ్లు చేసి కొడుకు, కోడలు వద్ద లాల్య,దేవి ఉంటున్నారు.
వీరన్న రోజూ మద్యం తాగి తల్లిదండ్రులు, భార్యతో గొడవపడేవాడు. గురువారం రాత్రి ఘర్షణకు దిగి తల్లిదండ్రులపై కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడినవారిని సూర్యాపేటకు తరలిస్తుండగా తల్లి దేవి మార్గమధ్యంలో మృతిచెందింది. తండ్రి లాల్య దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.