రెండో పెళ్లి: భర్త ఇంటి వద్ద మహిళ ఆందోళన
హైదరాబాద్: తన భర్త రెండో వివాహం చేసుకుని తనను మోసం చేశాడని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు కుమారుడు కుటుంబసభ్యులతో కలిసి బుధవారం హైదరాబాదులోని తాళ్లబస్తీలోని భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. మహబూబ్నగర్ జిల్లా వనపర్తికి చెందిన పావని (26)కి దోమలగూడలో నివాసముండే బోగరి వెంకటేష్ (30)తో 2011 మే 5న వివాహం జరిగింది.
పెళ్లి సమయంలో అత్తింటి వారు వెంకటేష్కు 5 లక్షల నగదు, 20 తులాల బంగారం, ద్విచక్ర వాహనం, గృహోపకరణ వస్తువులు అందజేశారు. వెంకటేష్ నాంపల్లిలోని ఆటోమొబైల్ షాపులో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళైన ఆరు నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అనంతరం పావనికి అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలని చీటికిమాటికి ఇబ్బందులకు గురిచేసేవారని ఆమె ఆరోపిస్తోంది.
2012లో గర్భం దాల్చిన పావని పుట్టింటికి వెళ్ళింది. ఆమెకు 2013 ఫిబ్రవరిలో కుమారుడు జన్మించాడు. రెండు నెలల తర్వాత ఇంటికి రాగా భర్త, అతని కుటుంబ సభ్యులు గొడవపడ్డారు. దీంతో పావని పుట్టింటికి వెళ్ళింది. అయితే 2014 ఆగస్టు 16న వెంకటేష్ మెదక్ జిల్లా గజ్వేల్కు చెందిన మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పావని కుటుంబ సభ్యులు వనపర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో గజ్వేల్ పీఎస్లో కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా వారికి న్యాయం జరగలేదు.

చివరగా తాళ్లబస్తీ కమిటీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. బస్తీ కమిటీ నాయకులు చెప్పినా వెంకటేష్ కుటుంబసభ్యులు వినలేదు. దీంతో పావని ఏడాదిన్నర కుమారుడు, మహిళా మండలి సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తాళ్లబస్తీలోని వెంకటేష్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. వెంకటేష్ ఇంట్లో లేడని చెప్పడంతో అతడి కుటుంబసభ్యులతో మహిళా మండలి సభ్యులు, పావని కుటుంబసభ్యులు వాగ్వివాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.. చివరకు వారు వెంకటేష్ను ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వెంకటేష్ను పావని కుటుంబ సభ్యులు నిలదీశారు. పావని తన వద్దకు రాకపోవడం వల్లనే మరో వివాహం చేసుకున్నానని వెంకటేష్ సమాధానమిచ్చాడు.
విడాకులు కూడా తీసుకున్నానని అతడు చెప్ప డంతో పావని కుటుంబసభ్యులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు జోక్యం చేసుకుని వనపర్తి పోలీసుస్టేషన్లో కేసు నమోదైందని, అక్కడే పరిష్కరించు కోవాలని ఇరువర్గాల వారికి సూచించారు. సమస్యను పరిష్కరించాలని అక్కడి పోలీసు లకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications