రాజీనామా చేస్తారా? కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ రావు సవాల్!!
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన పొలిటికల్ హీట్ కు కారణంగా మారింది. కామారెడ్డి జిల్లాలో రెండు రోజుల పర్యటన లో ఉన్న నిర్మల సీతారామన్ నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు, నేడు రేషన్ షాప్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరుపై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Recommended Video
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ రావు సవాల్
ఇదే సమయంలో కేంద్ర పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదని మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన హరీష్ రావ్ నిర్మల సీతారామన్ కు సవాల్ విసిరారు. 2021 లోనే ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ రాష్ట్రం చేరిందని పేర్కొన్న ఆయన, తెలంగాణ రాష్ట్రం ఆయుష్మాన్ భారత్ లో చేరకపోతే తాను ఇప్పుడే రాజీనామా చేస్తానని, చేరితే మీరు రాజీనామా చేస్తారా అంటూ నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.
రేషన్ షాప్ దగ్గర మోడీ ఫోటో పెట్టటం ప్రధాని స్థాయి దిగజార్చటమే
అంతేకాదు రేషన్ షాప్ దగ్గర ప్రధాని మోడీ పెట్టాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెబుతున్నారని, ప్రధాని పదవి స్థాయిని దిగజార్చేలా బిజెపి నేతలు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం మొత్తం వాళ్ళే ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు, ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయొద్దని నిర్మలా సీతారామన్ పై మండిపడ్డారు. ఇక దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి వెళ్ళేది ఎక్కువ, కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది తక్కువ అంటూ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
బీజేపీ మంత్రులు అసత్యాలు మాట్లాడుతున్నారు
బీజేపీ మంత్రులు నేతలు అందరూ అర్ధసత్యాలు, అసత్యాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మీరు మాట్లాడితే మాకు మాట్లాడ్డం రాదా అంటూ ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు మేము మాట్లాడగలం అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిజాలు మేము మాట్లాడుతుంటే, బీజేపీ మంత్రులు నేతలు అబద్ధాలు ప్రచారం చేసే పనిలో ఉన్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై చేస్తున్న తప్పుడు ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.