Liquor sales:మందు బాబులు తాగేశారు: తెలంగాణలో మద్యం అమ్మకాలు న్యూ రికార్డు.. ఎన్ని కోట్లంటే..!
హైదరాబాదు: తెలంగాణలో లాక్డౌన్ ప్రకటన వెలువడగానే ముందుగా హడలెత్తిపోయింది మాత్రం మందుబాబులే. అవును లాక్డౌన్ విధిస్తే మద్యం దొరకడం కష్టం అవుతుందేమో.. ఒకవేళ దొరికినా డబుల్ రేట్కు అమ్ముతారేమో అన్న అనుమానంతో మందుబాబులు అన్నీ వదిలేసి ఉన్నపళంగా వైన్ షాపుల ముందు వాలిపోయారు. ఒక్కొక్కరూ ఈ 10 రోజులకు కావాల్సిన సరుకును కాస్త రేటు ఎక్కువ పెట్టయినా సరే కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఇక తెలంగాణ ప్రభుత్వం బుధవారం నుంచి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించగానే మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. అదే ఒక మెడికల్ షాపు ముందో.. లేక మరో నిత్యావసర వస్తువుల కోసమో కూడా ఇలా ఓపిగ్గా గంటల పాటు క్యూలైన్లలో నిలుచున్న దాఖలాలు ఒక్కటంటే ఒక్కటి కనిపించదు.

మద్యం కోసం ఎగబాకిన మందుబాబులు
అసలే కరోనా.. మందు ముందు ఈ మహమ్మారి కూడా బలాదూర్ అన్నట్లుగా మద్యం ప్రియులు నిన్న వైన్ షాపుల ముందు వ్యవహరించారు. అసలు కరోనా బుసలు కొడుతోందన్న విషయం మరచి మద్యం కోసం ఎగబాకారు. ఇక ఇదే అదనుగా దుకాణాదారులు కూడా నిబంధనలను గాలికొదిలేశారు. సామాజిక దూరం పాటించకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు ఉత్పన్నమవుతాయో కరోనా లెక్కలే చెబుతాయి. ఇక లాక్డౌన్ సందర్భంగా అన్ని కార్యకలాపాలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఉండటంతో మద్యం ప్రియులు వైన్ షాపులకు దారులు వెతుక్కున్నారు. మద్యం మళ్లీ దొరుకుతుందో లేదో అన్న ఆత్రంతో విపరీతంగా కొనుగోలు చేశారు. అన్ని రకాల బ్రాండ్లు ఒకేసారి కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళుతూ కనిపించారు.

ఒక్కరోజే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
ఇక నిన్న ఒక్కరోజే అంటే లాక్డౌన్ ప్రకటన వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. ఏకంగా రూ.125 కోట్లు మేరా తెలంగాణలో మద్యం బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తీసుకుంటే రోజుకు రూ.70 కోట్లు మేరా మద్యం అమ్మకాలు జరుగుతాయి. కానీ నిన్న ఒక్కరోజు రెండో సగంలోనే రూ100 కోట్ల మార్కును దాటేసిందంటే మందు బాబులు మద్యం కొనుగోళ్లు ఏరేంజ్లో చేశారో అర్థమవుతోంది. ఇక మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా రూ.24 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే 2020 డిసెంబర్ 31వ తేదీన మద్యం అమ్మకాలు రూ.194 కోట్లు మేరా జరిగాయి. అయితే నిన్న అమ్మకాలు చూస్తే మరో సారి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారా అన్నంతగా పరిస్థితి కనిపించింది.

న్యూఇయర్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో
కొత్త సంవత్సరం సమయంలో జరిగిన అమ్మకాలను మినహాయిస్తే మంగళవారం ఒక్కరోజే జరిగిన మద్యం అమ్మకాలు ఈ ఏడాదిలో రికార్డు సృష్టించాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు మూడురోజులకు సరిపడా స్టాక్ను నిల్వ ఉంచుకున్న వైన్ షాప్ ఓనర్లు... ఆ సరుకు మొత్తం మంగళవారమే విక్రయించారు. హైదరాబాదులోని అతిపెద్ద మల్టీబ్రాండ్ లిక్కర్ రీటెయిలర్ టానిక్లో అయితే నిన్న ఒక్కరోజే రూ.4 కోట్లు మేరా బిజినెస్ జరిగింది. అందులో అన్ని షెల్ఫ్లు దాదాపుగా ఖాళీ అయ్యాయి.

సమయం పై అసంతృప్తితో మద్యం దుకాణాదారులు
మద్యం బాబుల మందు గోల ఇలా ఉంటే.. దుకాణాదారుల బాధ మరోలా ఉంది. ప్రభుత్వం విధించిన సమయం తమకు అనుకూలంగా లేదని వాపోతున్నారు. అంతకుముందు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మద్యం అమ్మకాలకు లైసెన్స్ ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం బిజినెస్ పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. మద్యం రవాణాకు కూడా కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి తెలంగాణ లికర్ మరియు బీర్ సప్లయర్స్ అసోసియేషన్ ఒక విజ్ఞప్తి చేసింది. ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా తాము మద్యంను డోర్ డెలివరీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఇక మద్యం అమ్మకాల సమయంను కూడా మారిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications