కేసీఆర్ సర్వే రిపోర్టుతో ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు టెన్షన్.. ఇప్పటినుండే పరేషాన్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్న ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని, ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసే పనిలో పడ్డారు.

తెలంగాణాలో క్షేత్ర స్థాయి పరిస్థితులపై గులాబీ బాస్ సర్వే
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఏ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది? ఏ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ వీక్ గా ఉంది? ఏ నియోజకవర్గంలో కాస్త కష్టపడితే టిఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంది? ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే బాగా పని చేస్తున్నారు? ఎవరు ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడంలో విఫలమవుతున్నారు? వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని కెసిఆర్ వివిధ సర్వే సంస్థల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను సర్వే చేయించారు.

40 పైగా ఎమ్మెల్యేలకు టెన్షన్
ఈ సర్వేలో మొత్తం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించి వాటిలో కచ్చితంగా విజయం సాధించేవి 40 ఉన్నాయని, ఇక కాస్త కష్టపడితే విజయం సాధించే నియోజకవర్గాలు 30 నుండి 35 వరకు ఉన్నాయని, మిగతా నియోజకవర్గాలు చాలా బలహీనంగా ఉన్నాయి అని కెసిఆర్ గుర్తించారు. ఇక కెసిఆర్ సర్వే రిపోర్ట్ తో టిఆర్ఎస్ పార్టీ లో వీక్ గా ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తాను ఇచ్చిన మాట ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం ఇస్తారా? లేదా నియోజకవర్గంలో వీక్ గా ఉన్నామన్న సర్వే రిపోర్ట్ ఆధారంగా కెసిఆర్ తమను పక్కన పెడతారా ? అన్నది దాదాపు నలభైకి పైగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగిస్తుంది.

వీక్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలలో ఆశావహుల కొత్త వ్యూహాలు
సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న క్రమంలో తమకు మళ్లీ టికెట్ ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటి అన్నదానిపై ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నట్టు గా తెలుస్తుంది. ఇప్పటినుండి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఎమ్మెల్యేలు కంటి మీద కునుకు లేకుండా ఆలోచనలో పడ్డారని సమాచారం. ఇక కెసిఆర్ సర్వే ప్రకారం నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో, తమకు అవకాశం ఇవ్వడం కోసం ఇప్పటి నుంచే కొంతమంది వ్యూహాత్మకంగా పావులు కదిపే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

ఆ నియోజకవర్గాలపై మంత్రులు, నేతలకుబాధ్యతలు అప్పగించే ప్లాన్ లో కేసీఆర్
సీఎం కేసీఆర్ పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేకపోలేదని భావిస్తున్న కొందరు ఆశావహులు ఇప్పటి నుండే ప్రజాక్షేత్రంలో పట్టు సాధించి సీఎం కేసీఆర్ చేతులమీదుగా టికెట్ తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే సీఎం కేసీఆర్ ప్రస్తుతం బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించి విజయం కోసం వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. బలహీనంగా ఉన్న నియోజకవర్గాలలో ప్రత్యేక దృష్టి పెట్టేలా మంత్రులు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం.

డేంజర్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలకు కొత్త పరేషాన్
దీనితోనే ఆ నియోజకవర్గాలలో త్వరలోనే ఇన్చార్జి లను నియమించి ఎన్నికల సమయం నాటికి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితిని మెరుగుపరచాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఇంత ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మెరుగు పడుకుంటే, కెసిఆర్ ఎమ్మెల్యేల టికెట్ల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదని పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక ఈ కారణంగానే డేంజర్ జోన్ లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తాజా పరిణామాలతో కంటి మీద కునుకు లేకుండా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications