చిన్నారిని నడుముకు కట్టుకుని బావిలోకి దూకి..
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మగపిల్లలు పుట్టలేదని భర్త, అత్త వేధిస్తుండటంతో తట్టుకోలేకపోయిన ఓ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరు కూతుళ్లలో చిన్నదైన రెండేళ్ల చిన్నారని తన నడుముకు కట్టుకుని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ధారూర్లో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
ధారూర్ మండలం అవుసుపల్లి గ్రామానికి చెందిన మొల్ల బిపాష కూతురు అలీమా (25)కు రాళ్ళచిట్టంపల్లికి గ్రామానికి చెందిన గాజుల లాల్ మహ్మద్తో 2007లో వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. దీంతో మగపిల్లలు లేరంటూ భర్త లాల్మహ్మద్, అత్త మొగులాంబీలు రోజూ ఆమెను వేధించేవారు. ఈ విషయాన్ని పుట్టింటివారికి చెప్పడంతో వారు పంచాయితీ పెట్టించారు.
గత మంగళవారం భర్త, అత్త కలిసి అలీమాను తీవ్రంగా కొట్టడంతో రెండ్రోజుల క్రితం మళ్లీ పుట్టింటికి చేరింది. అత్తింటివారు పెట్టే బాధలు భరించలేనని, ఆత్మహత్య తప్ప మరోమార్గం లేదని బాధపడింది. గురువారం ఉదయం తన చిన్నకూతురు నూర్జహాన్ను నడుముకు కట్టుకుని సమీపంలోని రుద్రారం ఆశయ్య బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
మృతురాలి తల్లి మొల్ల బిపాష ధారూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధారూర్ తహశీల్దార్, వికారాబాద్ డిఎస్పీ స్వామి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వికారాబాద్ ఆసుపత్రిలో శవ పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ధారూర్ ఎస్ఐ నాగభూషణం తెలిపారు.