హైదరాబాదులో శ్రీకాకుళం మహిళ ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాదులోని అల్కాపురిలో నివాసముంటున్న నవవధువు మంగళవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని మరణించింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం గౌతవెల్లి గ్రామానికి చెందిన తొత్తరపుడి భాస్కర్, సుజాత (18)కు ఈ ఏడాది ఆగస్టులో వివాహ మైంది. దంపతులిద్దరూ అల్కాపురి రోడ్డు నం.3లో నివాసముంటున్నారు. భాస్కర్ తల్లిదండ్రులు లక్ష్మి, గణేష్ కూడా వీరితోనే ఉంటున్నారు.
భాస్కర్ ఇంటికి సమీపంలోనే హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం అందరూ స్వగ్రామం వెళ్లేందుకు రైలు టికెట్లు బుక్ చేయించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భాస్కర్, సుజాత మోర్ సూపర్మార్కెట్లో షాపింగ్కు వెళ్లి వచ్చారు. ఆ తరువాత సుజాతను రాత్రి 8.30 గంటలకు ఇంటి ముందు బైకుపై దింపిన భాస్కర్ మళ్లీ వస్తానంటూ బనియన్లు కొనేందుకు వెళ్లాడు.
ఇంట్లో అత్త లక్ష్మి కూరగాయలు తరుగుతుండగా.. కడుపునొప్పని చెప్పిన సుజాత బెడ్రూంలోకి వెళ్లింది. ఎంతకూ బయటికి రాకపోవటంతో లక్ష్మి తలుపు తట్టింది. తలుపు తీయకపోవటంతో చుట్టుపక్కల వారికి, కొడుకుకు ఫోన్ చేసి చెప్పింది. దూరంగా ఉన్న భాస్కర్ తన వద్ద పని చేసే రవిని ఇంటికి పంపించాడు. తలుపు పగులగొట్టి చూడగా సుజాత ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కన్పించింది.
కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు అక్కడికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆమె మృతికి కారణాలు తెలియరాలేదని వారు పేర్కొన్నారు. తమ మధ్య విభేదాలు లేవని భాస్కర్ తెలిపినట్టు పోలీసులు చెప్పారు.