విచిత్రం: భర్తతో కాపురానికి చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ
హైదరాబాద్: భర్తతో కాపురం చేయడానికి చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ పోలీసులకు దొరికిపోయింది. సికింద్రాబాదులోని చిలకలగూడ పోలీసులు బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మెదక్జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలపల్లి గ్రామానికి చెందిన రమేశ్ భార్య బి.రేణుక తన 9నెలల చిన్నారి కావ్యతోపాటు తన అత్తతో కలిసి థైరాయిడ్ చికిత్స కోసం జూలై 31వతేది గాంధీ ఆసుపత్రికి వచ్చింది.
రావడంలో ఆలస్యం కావడంతో ఆస్పత్రి ఔట్పేషెంట్ విభాగం మూసివేశారు. దీంతో మరుసటిరోజు తిరిగి రావడం ఎందుకుని గాంధీ ఆసుపత్రిలో వెయిటింగ్లో ఉండే రేకుల షెడ్లో షెల్టర్ తీసుకున్నారు. ఇంతలో ఓ.దివ్యజ్యోతి అనే మహిళ రేణుకతో పరిచయం పెంచుకుంది. దివ్యజ్యోతి భర్త చిన్న శేషయ్య కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఆలుగొండ గ్రామానికి చెందినవాడు.
తనకు కూడా థైరాయిడ్ సమస్య ఉందని తనకు పెద్ద డాక్టర్ తెలుసునని అప్పటికప్పుడు మరో వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించి ఆయనతో పరిచయం చేయిస్తానని నమ్మించింది. రాత్రి కాగానే అందరు నిద్రకు ఉపక్రమించారు. దివ్యజ్యోతి సైతం రేణుక ప్రక్కనచేరి నిద్రించినట్లు నటించింది.
తాను అప్పటికే వేసుకున్న పథకం ప్రకారం చిన్నారి కావ్యను గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకుని కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకుని అటు నుంచి కర్నూలు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తిరిగి చివరకు తమ స్వగ్రామానికి చేరుకుంది. ఇటు నిద్రపోయిన రేణుక లేచి చూసే సరికి తన కూతురు కనిపించకపోవడంతో చిలకలగూడ పోలీసులను ఆశ్రయించింది.
చిలకలగూడ పోలీసులు సిసి కెమెరాలు బాధితురాలు ఇచ్చిన సమాచారం ఆనవాలుతోపాటు సెల్ఫోన్ల సహాయంతోప్రత్యేక టీమ్ను ఏర్పాటుచేసి నిందితురాలి కోసం గాలింపు చేపట్టారు. నిందితురాలిని పోలీసులు ఎట్టకేలకు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నిందితురాలు దివ్యజ్యోతి తొలుత భువనరిగికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అతను మృతి చెందడంతో కర్నూలుకు చెందిన చిన్నశేషయ్యను ప్రేమించి రెండో వివాహం చేసుకుంది. అప్పటికి ఆమెకు సంతానం కలగలేదు. పైగా థైరాయిడ్ సమస్య ఉండడంతో కడుపు పెరగడం మొదలుపెట్టింది. ఇంట్లో వారు సంతానం కోసం అడుగుతుండడంతో తనకు థైరాయిడ్తో ఎత్తుగా వచ్చిన కడుపును గర్భం దాల్చినట్లుగా ఇంట్లో వారిని నమ్మించింది.
తొమ్మిది నెలల సమయం కాగానే ఇంట్లో వారు ప్రసవం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి దివ్యజ్యోతి తప్పించుకుని పారిపోయింది. అటు నుంచి వెళ్లిన ఆమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన సహకారంతో మరో ముగ్గురితో పరిచయం ఏర్పరుచుకుని వారికి డబ్బు ఆశచూపి తొమ్మిది నెలలపాపను దొంగిలించడానికి పథకం వేసింది.
ఇందులో భాగంగా గాంధీ ఆసుపత్రికి చేరుకుని తొమ్మిది నెలల కావ్యను చూసి తల్లికి మాయమాటలు చెప్పి చిన్నారిని తస్కరించి ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. నిందితురాలు దివ్యజ్యోతితోపాటు ఆమెకు సహకరించిన ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన రవి, కళ్యాణ్, సంజీవయ్య అనే మరో ముగ్గురిని అరెస్టుచేసి పోలీసులు రిమాండ్కు తరలించారు.