ప్రియుడితో ఇంటి యజమానిని హత్య చేయించిన మహిళ
హైదరాబాద్: తన ప్రియుడితో ఓ మహిళ ఇంటి యజమానిని హత్య చేయించిన సంఘటనలో పోలీసులు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తీసుకున్న అప్పును చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఆ మహిళ ఏకంగా అప్పు ఇచ్చిన వ్యక్తిని హత్య చేయించింది. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
వివరాలను టాస్క్ఫోర్స్ డీసీపీతో కలిసి దక్షిణ మండల డీసీపీ వి. సత్యనారాయణ వెల్లడించారు. హైదరాబాదులోని తలాబ్కట్ట ప్రాంతానికి చెందిన అబ్దుల్ రెహ్మాన్ ఇంటిలో షబానా ఫటాన్ అనే మహిళ ఐదేళ్లుగా అద్దెకు ఉంటోంది. దానికితోడు అతని వద్ద రూ.80 వేలు అప్పుగా తీసుకుంది.
వాటిని తిరిగి చెల్లించాలని అబ్దుల్ రెహ్మాన్ అడగడంతో అతడి అడ్డు తొలగించుకోవాలని భావించింది. తన పథకాన్ని బాయ్ఫ్రెండ్ జబ్బర్కు తెలిపింది. దీంతో అబ్దుల్ రెహ్మాన్ను హత్య చేయడానికి జబ్బర్ తన స్నేహితులు అమ్జద్ఖాన్, షేక్ సికిందర్ల సహాయం కోరాడు. మహారాష్ట్రకు చెందిన జబ్బర్ హైదరాబాదులోని సంతోష్నగర్లో ఉంటూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు.

జబ్బర్ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అబ్దుల్ రెహ్మాన్కు 10వ తేదీన ఫోన్ చేసి తాను ఇమ్రాన్ను మాట్లాడుతున్నాని పరిచయం చేసుకున్నాడు. తాను వస్తున్నానని చెప్పి తన స్నేహితులతో కలిసి అతడి ఇంటికి చేరుకున్నాడు. అక్కడే అబ్దుల్ రెహ్మాన్పై వారందరూ దాడి చేసి హత్య చేశారు.
అనంతరం అతడి ఇంట్లోని 18 తులాల బంగారు ఆభరణాలతోపాటు కొంత నగదును తీసుకుని పారిపోయారు. తర్వాత తమ సెల్ నెంబర్లను మార్చి ఇతర రాష్ర్టాలకు వెళ్లారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి బంగారు ఆభరణాలతోపాటు ఓ కత్తి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications