శ్రుతిని రేప్ చేసి చంపేశారు, కవిత ఓసారి చూడాలి: సీతక్క
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో జరిగిన మావోయిస్టు శ్రుతి ఎన్కౌంటర్ అత్యాచారంతో కూడిన హత్యేనని తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ శాసనసభ్యురాలు సీతక్క ఆరోపించారు. నక్సలైట్ల ఎజెండానే తమ అజెండా అంటూ అధికారంలోకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పుడు బూటకపు ఎన్కౌంటర్లతో హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. బతుకమ్మతో ఊరూరా తిరిగిన టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఓసారి శ్రుతి మృతదేహాన్ని పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో విద్యాసాగర్ రెడ్డి, శ్రుతి అనే ఇద్దరు మావోయిస్టుల మరణించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన వివాదంగా మారుతోంది. శ్రుతి, విద్యాసాగర్ మృతదేహాలను మంగళవారం అర్థరాత్రి వరంగల్లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.
బుధవారంనాడు మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించాల్సి ఉండింది. అయితే పోలీసులు మృతుల తల్లిదండ్రులను మార్చురీలోకి అనుమతించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మృతుల కుటుంబ సభ్యులను లోనికి అనుమతించారు.
మృతదేహాన్ని చూసిన తర్వాత శ్రుతి తల్లిదండ్రులు సుదర్శనం, రమాదేవి ఆవేశంగా బయటకు వచ్చారు. విప్లవ కవి వరవరరావుకు పరిస్థితిని వివరించారు. శ్రుతి ఒంటిపై గాయాలున్నాయని, దారుణంగా కాల్చి చంపారని, చిత్రహింసలకు గురి చేశారని, కడుపుపై యాసిడ్ పోయడంతో పేగులూ మాంసపు ముద్దలు బయటికి కనిపిస్తున్నాయని, శ్రుతిని కడుపు వరకే చూపించారని రమాదేవి అన్నారు.తన బిడ్డపై అత్యాచారం చేశారని, చేతికి కూడా గాయాలున్నాయని ఆమె బోరున విలపిస్తూ చెప్పింది.