ఒక్క అవకాశం: పవన్ను కలవాలంటూ యువతి హల్చల్, సిబ్బంది నిరాకరణ
హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసేందుకు అవకాశం ఇప్పించాలంటూ ఓ యువతి నాలుగు రోజులుగా జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటి ముందు పడిగాపులు కాస్తోంది. తన బాధలు చెప్పుకునేందుకు కనీసం 10 నిమిషాలైనా కేటాయించాలంటూ భద్రతా సిబ్బందిని కోరింది.
వివరాల్లోకి వెళితే కొండాపూర్కు చెందిన జ్యోతి నాలుగు నెలలుగా నందగిరి హిల్స్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వస్తోంది. అయితే తొలిరోజే సార్ లేరని, నెల రోజుల తర్వాత వస్తారని చెప్పి పంపినా ప్రతిరోజూ ఆమె అక్కడికి వస్తోంది. పవన్ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా భద్రతా సిబ్బంది నిరాకరిస్తూ వస్తున్నారు.
బుధవారం కూడా ఆమె ఉదయం వచ్చి సాయంత్రం వరకు పవన్ ఇంటి ముందున్న రోడ్డుపై బైఠాయించింది. తాను పవన్ను కలవాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన మీడియాతో జ్యోతి మాట్లాడారు. నాలుగు నెలలుగా పవన్ ఇంటి చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు.
సెక్యూరిటీ, పీఏ ఆయనను కలవకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. తాను పవన్ అభిమానినని, కష్టాలు ఆయనతో చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని ఆశతో కలిసేందుకు అవకాశం కోరుతున్నట్టు తెలిపింది. పవన్ లేరని ఎంత చెప్పినా వినకుండా రాత్రి 8 గంటల వరకు అక్కడే బైఠాయించింది.
దీంతో భద్రతా సిబ్బంది డయల్ 100కు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు వచ్చి రాత్రి పది గంటల ప్రాంతంలో ఆమెను జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారించగా... తన పేరు జ్యోతి అని, కొండాపూర్లో ఉంటున్నానని చెప్పింది.
ఈమేరకు ఆమె చిరునామా తెలుసుకొని పోలీసులు ఆమెను ఇంటికి పంపించారు. గతంలోనూ ఆమె సినీనటుడు మహేశ్బాబు ఇంటి ముందు, మరో ప్రైవేటు కార్యాలయం ఎదుట ఇలాగే ఆందోళన చేసినట్లు పోలీసులు గుర్తించారు.