కన్న తల్లే: రెండు నెలల పిల్లాడ్ని రూ. 10 వేలకు అమ్మింది
తన రెండు నెలల కన్న కొడుకుని ఓ మహిళ పది వేల రూపాయలకు విక్రయించింది. భర్త ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: రెండు నెలల పిల్లవాడిని రైల్వేస్టేషన్లో పరిచయం అయిన మహిళ ద్వారా రూ.10వేలకు తల్లి విక్రయించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సికింద్రాబాదులోని గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, తుకారాంగేట్ ఇన్స్పెక్టర్ జి.రమేష్ శుక్రవారంనాడు వెల్లడించారు.
సికింద్రాబాదులోని లాలాగూడకు చెందిన రాజు సెంట్రింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య కవిత వయస్సు 21 ఏళ్లు. వీరికి రెండు నెలల వయసున్న కుమారుడు ఉన్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఇక్కడ ఉండేందుకు ఆమె ఇష్టపడడం లేదు.
భర్త యాదగిరిగుట్టకు వెళ్లడంతో 2017మార్చి 23న కామారెడ్డిలోని బంధువుల ఇంటికి వెళ్లింది. గత నెల 28న రైల్వేస్టేషన్కు చేరుకుని ప్లాట్ఫాంపై ఉండగా మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లికి చెందిన ఎం.సుమలత(30)తో పరిచయమైంది.
నా పిల్లాడ్నే ఇస్తానని..
తనకు తెలిసినవాళ్లకు పిల్లవాడు కావాలని సుమలత చెప్పడంతో తన మూడు నెలల పిల్లవాడిని విక్రయిస్తానని కవితి ముందుకు వచ్చింది. ఇద్దరు కలసి బెల్లంపల్లికి వెళ్లారు.
వారికి పిల్లలు లేకపోవడంో..
కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని మారుతీనగర్కు చెందిన రమేష్బాబు, అంజలి(30) వివాహం జరిగి 14 ఏళ్లయినా పిల్లలు లేరు. దాంతో వారు కవితతో రూ.10వేలకు బేరం కుదుర్చుకున్నారు. తిరిగి ఈనెల 4న భర్తకు తానే ఫోన్ చేసింది. పిల్లవాడు ఎక్కడున్నాడని అడగడంతో పిల్లవాడిని అమ్మేశానంటూ తెలియజేసింది.
ఆమెను భర్తే పట్టిచ్చాడు...
భార్య ఇంటికిరాగానే ఆమెను తీసుకుని వెళ్లి భర్త తుకారంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమలతను అదుపులోకి తీసుకుని చిన్నారిని తీసుకొచ్చారు. తల్లితో పాటు మధ్యవర్తి, కొనుగోలు చేసిన మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పేదరికం కారణంగానే...
కడు పేదరికం కారణంగానే ఆ తల్లి తన కన్న బిడ్డను విక్రయించడానికి పూనుకుంది. భర్త రాజుకు తెలియకుండా బిడ్డను విక్రయించడం ఆమెను కష్టాల్లోకి నెట్టింది. తొలుత బుకాయించడానికి కవిత ప్రయత్నించింది. అయితే, రాజు పట్టు వదలకపోవడంతో నిజం చెప్పేసింది.