ఉరేసుకున్న మహిళా ఎస్సై.. పూణేలో విధినిర్వహణ, హైదరాబాద్ లో ఆత్మహత్య
పూణేలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న స్వాతి చౌహాన్ మంగళవారం హకీంపేట నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఐఎస్ఏ)లోని గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హైదరాబాద్: నగరంలోని పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో విషాదం చోటుచేసుకుంది. హకీంపేట నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఐఎస్ఏ)లో పూణే ఎస్సై బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఎన్ఐఎస్ఏలో శిక్షణ పొందుతున్న తన స్నేహితురాలిని కలిసేందుకు మహారాష్ట్ర పూణేకు చెందిన స్వాతి చౌహాన్ ఈనెల 24వ తేదీన హైదరాబాద్ వచ్చారు. ఆమె మంగళవారం ఉదయం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
స్వాతి చౌహాన్ పూణేలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్. స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు జవహర్ నగర్ పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకున్నారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.