కెసిఆర్పై వ్యాఖ్య: బాబుపై యాదవుల మండిపాటు
హైదరాబాద్: టిడిపి లేకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గొర్రెలు మేపుకోవాల్సి వచ్చేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై యాదవులు మండిపడుతున్నారు. తమ కులాన్ని చంద్రబాబు కించపరిచారని వారు ఆరోపిస్తున్నారు. అక్కడక్కడ ఆందోళనలకు కూడా దిగుతున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏపీ సీఎం చంద్రబాబు తమ వృత్తిని అవమానించారని నల్గొండ, నాగార్జునసాగర్ల్లోచంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అంతేకాకుండా యాదవ సంఘం నేతలు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో చంద్రబాబుపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఇదిలావుంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ను, ఏపీ సీఎం చంద్రబాబు తమతో పోల్చాడని మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్లో గొర్రెలకాపరులు ఆందోళన నిర్వహించారు. ప్రజలందరికీ గొర్రెల మాంసాన్ని అందించే తమ జాతిని చంద్రబాబు కించపరిచేలా మాట్లాడారని గొల్లకుర్మ సంఘం ఆధ్యర్యంలో నిరసన చేపట్టారు. చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
కాగా, ఓ టీవీ చానెల్ చర్చలో కూడా కాంగ్రెసు నాయకుడు మల్లు రవి చంద్రబాబు వ్యాఖ్యలను తప్పు పట్టారు. కులాన్ని కించపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యానించారని ఆయన అన్నారు.