నా కోసం మరో పెళ్లి చేసుకో: సూసైడ్ నోట్లో యువకుడు
హైదరాబాద్: ప్రేమించి పెళ్లిచేసుకున్న అమ్మా యిని కుటుంబ సభ్యులు ఆదరించలేదనే మనస్థాపంతో హైదరాబాద్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులను కాదనలేక, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మరిచిపోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అతను సూసైడ్నోట్లో చెప్పాడు.
తన చావుకు ఎవరూ కారణం కాదని, కుటుంబ సభ్యులంటే తనకు ఎంతో అభిమానం ఉందని రాశాడు. ఐ లవ్ మై ఫ్యామిలీ.. ఐ లవ్ యూ.. ఐ హేట్ మై లైఫ్... అంటూ లేఖలో రాశాడు. కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన ప్రవీణ్కుమార్(24), ఏలూరుకు చెందిన ఓ యువతితో విజయవాడలో చదువుకునే సమయంలో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీయటంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలం దంపతులిద్దరూ ఏలూరులో నివాసం ఉన్నారు.
అక్కడ ఉంటే ఇరు కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో నెల రోజుల క్రితమే హైదరాబాద్ చేరారు. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చేంత వరకూ వేర్వేరుగా ఉందామని నిర్ణయించుకుని ప్రైవేటు హాస్టల్స్లో ఉంటున్నారు. ఇటీవలే ఆ యువతి ఓ మొబైల్ కంపెనీలో డీటీపీ ఆపరేటర్గా చేరింది. ప్రవీణ్ ఉద్యోగం వేటలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. పెళ్లికి అంగీకరించాలని కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ప్రవీణ్కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దీంతో సోమవారం సాయంత్రం ప్రవీణ్కుమార్ ఆ యువతికి ఫోన్ చేసి ‘నన్ను క్షమించు.. ఐ లవ్ యూ రా' అంటూ ఫోన్ పెట్టేశాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె ఎల్బీనగర్లోని విజయపురి కాలనీలో అతడు ఉంటున్న హాస్టల్కు వెళ్లింది. గదిలో ప్రవీణ్కుమార్ నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించి కేకలు పెట్టడంతో స్థానికులు వచ్చి విషయాన్ని పోలీసులకు చేరవేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ గదిని పరిశీలించగా సూసైడ్నోట్ కనిపించింది.
మనసారా ప్రేమించి నూరేళ్లు కలిసి జీవిద్దామని పెళ్లి చేసుకున్న యువతిని కష్టపెట్టడం ఇష్టంలేకనే మరణాన్ని ఆశ్రయిస్తున్నానని, లోకం తెలియని అమాయకురాలి బాధ్యతను తల్లిదండ్రులు తీసుకుని చిన్నకూతురులా చూడాలని లేఖలో సూచించాడు.
అమ్మా, నాన్న, కుటుంబ సభ్యులను మోసం చేసి అఘాయిత్యానికి పాల్పడటాన్ని క్షమించమంటూ వేడుకున్నాడు. తన తప్పును మన్నించి భార్య మరో పెళ్లి చేసుకోవటమే తన చివరి కోరికంటూ లేఖలో రాశాడు. విషపదార్థాలు తీసుకోవటం వల్లనే ప్రవీణ్కుమార్ మరణించినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.