ఫోర్బ్స్ ఇండియాలో చోటు దక్కించుకున్న పెద్దపల్లికి చెందిన యూట్యూబర్.. ఎందుకంటే
కష్టేఫలి అంటారు. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని పెద్దపల్లి కి చెందిన వ్యక్తి నిరూపించాడు. ప్రతిష్ఠాత్మకమైన ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకుని సత్తా చాటాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెద్దపల్లికి చెందిన యూట్యూబర్ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రముఖ వ్యాపార పత్రిక అయిన ఫోర్స్ ఇండియా లో యూట్యూబర్ సయ్యద్ హఫీజ్ స్థానం దక్కించుకున్నారు.
టాప్ 100 డిజిటల్ స్టార్స్ లో స్థానం దక్కించుకున్న పెద్దపల్లి వాసి
ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 'టాప్ 100 డిజిటల్ స్టార్స్'లో హఫీజ్ 32వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. డిజిటల్ ప్లాట్ ఫారమ్ లో బాగా ప్రభావవంతంగా పని చేస్తున్న వ్యక్తిగా హఫీజ్ ను గుర్తించింది ఫోర్బ్స్ ఇండియా . 2011 నుండి సయ్యద్ హఫీజ్ తెలుగు టెక్ టట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అతను నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ 16 లక్షల మంది సబ్స్క్రైబర్లను దాటింది.
మొబైల్ ఫోన్లతో పాటు ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ కు సంబంధించిన సమాచారం యూట్యూబ్ ఛానల్ లో
గోదావరిఖనిలోని ఎయిట్ ఇంక్లైన్ కాలనీకి చెందిన హఫీజ్ కంప్యూటర్ సెంటర్ నడుపుతూ 2011లో తెలుగు టెక్ టట్స్ అనే యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించాడు. ఇక ఈ ఛానల్ ద్వారా అతను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. మొబైల్ ఫోన్ల వినియోగానికి సంబంధించిన అనేక అంశాలను తెలియజేయడంతో పాటు, వివిధ కంపెనీలు కొత్త మొబైల్ ఫోన్లను అన్బాక్సింగ్ చేయడం, వాటి ఫ్యూచర్స్, లాభ నష్టాలు, కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను లాంచ్ చేయడం వంటి మొబైల్ ఫోన్ లకు సంబంధించి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కు సంబంధించి అనేక అంశాలను హఫీజ్ తన ఛానెల్లో వీడియో పోస్ట్ చేయడం ద్వారా వినియోగదారులకు తెలియజేస్తున్నారు.
యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతీనెలా 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్న హఫీజ్
హఫీజ్ తన ఛానెల్ 16 లక్షల మంది సబ్స్క్రైబర్లను పొందగలిగిన కారణంగా ప్రతి నెల దాదాపు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. కాబట్టి, ఫోర్బ్స్ ఇండియా తన ఛానెల్కు 32వ స్థానాన్ని ఇచ్చింది. ఫోర్బ్స్ ఇండియా, తన మ్యాగజైన్లో, తెలుగు టెక్ టట్స్ యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ, ఎక్కువ మందిని ఆకర్షిస్తోందని వివరించింది. అంతే కాదు ఇది ఎంతో ఉపయోగకరంగా సమాచారాన్ని అందిస్తుందని పేర్కొంది.
యూట్యూబ్ ఛానల్ తో తన స్కిల్స్ అందరికీ తెలిసేలా చేస్తున్న హఫీజ్
సింగరేణి ఉద్యోగి కుమారుడైన హఫీజ్ ఉన్నత చదువులు చదవాలి అనుకుని, కుటుంబ కారణాల నేపథ్యంలో చదవలేకపోయారు. కానీ తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సయ్యద్ హఫీజ్ ప్రజలను ఆకర్షిస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ తో తన స్కిల్స్ అందరికీ తెలిసేలా చేస్తున్న హఫీజ్ ప్రతిష్టాత్మక ఫోర్స్ ఇండియా జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు.