వైఎస్ షర్మిలతోపాటు వైటీపీ నేతలకు నాంపల్లి కోర్టులో ఊరట: వాదనలు ఇలా
హైదరాబాద్: వైయస్సార్ తెలంగాణ పార్టీ(వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ప్రగతిభవన్ ముట్టడికి కారులో ఆమె వెళ్తుండగా పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్న విషయం తెలిసిందే. షర్మిల డ్రైవింగ్ సీట్లో ఉండగానే కారును పోలీసులు క్రేన్ వాహనంతో లిఫ్ట్ చేసి తరలించారు.

వైఎస్ షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
ఈ క్రమంలో జరిగిన ఘటనకు సంబంధించి.. షర్మిలతోపాటు మరో ఆరుగురు వైటీపీ నేతలపై ఐపీసీ 143,341, 290, 506, 509, 353, 149 సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఆర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు.

నాంపల్లి కోర్టులో షర్మిల: వాదనలు ఇలా
అనంతరం షర్మిలను మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. తమ క్లయింట్ పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని షర్మిల తరపు న్యాయవాదులు వాదించారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళితే.. అక్రమంగా అరెస్ట్ చేశారని, పోలీసుల తీరును తప్పుపట్టారు. గతంలో ఎమ్మెల్యే రాజా సింగ్ రిమాండ్ వ్యవహారాన్ని ఈ సందర్భంగా న్యాయవాది మెజిస్ట్రేట్ ముందు ప్రస్తావించారు. పోలీస్ విధులకు ఎక్కడా తమ క్లయింట్ ఆటంకం కలిగించలేదని షర్మిల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.

షర్మిలతోపాటు వైటీపీ నేతలకు బెయిల్ మంజూరు
అయితే, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉన్నందునే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముందస్తుగా సహకరించాలని కోరామని, కానీ, ఆమె, పార్టీ కార్యకర్తలతో న్యూసెన్స్ క్రియేట్ అయ్యిందని పోలీసులు తెలిపారు. ఇలాంటి సమయంలో రిమాండ్ విధించకపోతే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు మెజిస్ట్రేట్ ను కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్నారు న్యాయమూర్తి. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. షర్మిలతోపాటు మరో ఆరుగురు వైటీపీ నేతలకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. దీంతో షర్మిల తన నివాసం లోటస్ పాండ్కు వెళ్లిపోయారు. షర్మిల ఇంటికి రావడంతో విజయమ్మ కూడా తన దీక్షను విరమించుకున్నారు.












Click it and Unblock the Notifications