కబ్జాలు చేసే నిన్ను ఎన్నిసార్లు బట్టేబాజ్ అనాలి? నర్సాపూర్ ఎమ్మెల్యేపై ఘాటుగా వైఎస్ షర్మిల
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. నూట అరవై ఆరు రోజులుగా సాగుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె అధికార టీఆర్ఎస్ మంత్రులపై, ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు వైయస్ షర్మిల.
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
ఇప్పటికే ఏ నియోజకవర్గానికి వెళ్లినా, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అవినీతిని, అక్రమాలను తూర్పారబడుతున్న వైఎస్ షర్మిల తాజాగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇసుక, భూ మాఫియాలకు కేరాఫ్ అట అంటూ మొదలు పెట్టిన షర్మిల, నియోజకవర్గంలోని ప్రజలపై, ఎమ్మెల్యే జులుం పైన మాట్లాడారు. కల్యాణలక్ష్మి రాలేదని లబ్ధిదారుడు ప్రశ్నిస్తే.. బట్టేబాజ్ అని తిడతాడట. జైలులో వేయాలని చెబుతాడట. మరి ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చని నిన్ను, ఎన్నిసార్లు బట్టేబాజ్ అనాలి? ఎన్నిసార్లు లోపలేయాలి? అంటూ వైఎస్ షర్మిల తనదైన శైలిలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ని టార్గెట్ చేశారు.
ఎమ్మెల్యే తీరును తూర్పారబట్టిన వైఎస్ షర్మిల
ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా బట్టే బాజ్ అంటాడా అని మండిపడ్డారు . ఎమ్మెల్యే మదన్ రెడ్డి సోయి ఉండి మాట్లాడుతున్నాడా అని ప్రశ్నించారు. ఇల్లు లేని ఒక మహిళ తనకు ఇల్లు కావాలని ఎమ్మెల్యే ను అడిగితే, కరోనా వచ్చి జనాలు చస్తుంటే నీకు ఇల్లు కావాలా అంటూ అత్యంత అవమానకరంగా మహిళపై మాట్లాడాడని వైయస్ షర్మిల మండిపడ్డారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గింది కదా.. ఎంతమందికి ఇల్లు కట్టారో చెప్పాలని వైయస్ షర్మిల ప్రశ్నించారు. ఎంతమందికి ఎమ్మెల్యే ఇల్లు ఇచ్చాడో లెక్క చెప్పాలన్నారు.
బతుకమ్మ చీరలిచ్చి కేసీఆర్ పాపాలు కడుక్కుంటున్నాడు
అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇస్తున్న బతుకమ్మ చీరల పై కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రూ.300 చీరె ఇచ్చి, మూడు తరాల పాపాలను కడిగేసుకోవాలని చూస్తున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు లేవు . కరెంట్ చార్జీలు పెరిగాయి. ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. నిత్యావసర ధరలు పెరిగాయి. ఈ పాపాలను కడిగేసుకోవాలనే చీరెలు పంచుతున్నారు అంటూ వైయస్ షర్మిల కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు.
తెలంగాణాలో అరాచక పాలన పోయి వైఎస్సార్ పాలన రావాలన్న షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని పేర్కొన్న వైయస్ షర్మిల, వైయస్ఆర్ ప్రజల కోసమే జీవించారని స్పష్టం చేశారు. ఆయన ప్రజల కోసమే మరణించారని గుర్తు చేశారు. నేడు అలాంటి నాయకుడే లేడు. వైయస్ఆర్ సంక్షేమ పాలన పూర్తిగా మరుగునపడింది. అందుకే వైయస్ఆర్ బిడ్డ వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిందని వైయస్ షర్మిల పేర్కొన్నారు. వైయస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే పార్టీ పెట్టానని ప్రజలందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. తనకోసం కొండంత అభిమానం తో వచ్చిన అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అవ్వాతాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావాలంటే కెసిఆర్ సర్కార్ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications