తెలంగాణలో షర్మిల తొలి యాక్షన్ ప్లాన్ ఇదే... టీఆర్ఎస్ టార్గెట్గా సమరశంఖం... 3 రోజుల నిరాహార దీక్ష...
ఖమ్మం సంకల్ప సభతో తెలంగాణ ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటి అడుగు వేసిన వైఎస్ షర్మిల.. తమ తొలి యాక్షన్ ప్లాన్ను సిద్దం చేశారు. టీఆర్ఎస్ టార్గెట్గా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్న షర్మిల... ఈ క్రమంలో తొలి పోరు నిరుద్యోగ సమస్యపై చేయాలని నిర్ణయించారు. ఖమ్మం సభలోనే షర్మిల దీనిపై ప్రకటన చేయగా... తాజాగా ఆమె అనుచరులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు నిరుద్యోగ సమస్యపై షర్మిల నిరాహార దీక్ష చేస్తారని వెల్లడించారు.
షర్మిల నిరాహార దీక్ష...
హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆమె అనుచరులు వెల్లడించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న తెలంగాణలో లక్షా 91 వేల ప్రభుత్వ పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేంతవరకూ షర్మిల పోరాటం చేస్తారని చెప్పారు. నిరుద్యోగ యువతకు అండగా... వారికి ఉద్యోగ అవకాశాలు రావాలన్న ఉద్దేశంతో ఈ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఒకవేళ వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో దీక్షలు చేస్తామని పేర్కొన్నారు.
నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు...
ఉద్యోగాల విషయంలో తెలంగాణ యువత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిరుద్యోగులు ఆ వాదనను ఖండిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క గ్రూప్-1,డీఎస్సీ నోటిఫికేషన్ వేయలేదని వాపోతున్నారు. పైగా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓవైపు నోటిఫికేషన్లు రాక... ఏండ్లకేండ్లు ఎదురుచూస్తూ తమ వయసు అయిపోతోందని... ఇలాంటి సమయంలో నిరుద్యోగుల వయోపరిమితిపై ఆలోచన చేయాల్సిన ప్రభుత్వం ఇలా రిటైర్మెంట్ వయసును పెంచడమేంటని ప్రశ్నిస్తున్నారు.
Recommended Video
యువతను ఆకర్షించేందుకే... ఈ అంశంపై ఫైట్...
గతేడాది డిసెంబర్ మాసంలో 50వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం లీకులు ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు,ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నిక కారణంగా ఇప్పటివరకూ నోటిఫికేషన్లు జారీ చేయలేదు. మరోవైపు నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో ఇప్పటికే నిరుద్యోగులు నగరాల్లో కోచింగ్ సెంటర్లలో చేరారు. తీరా ఇంతలోనే కరోనా కారణంతో విద్యా సంస్థలు మూసివేయడంతో మళ్లీ ఇంటి బాట పట్టారు. కొంతమంది నగరాల్లోనే ఉంటూ ప్రిపరేషన్ సాగిస్తుండగా... మరికొంతమంది ఇంటి వద్దే ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా నోటిఫికేషన్లు ఇవ్వాలని... నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య పట్ల యువతలో తీవ్ర అసంతృప్తితో నెలకొన్న నేపథ్యంలో... ఇదే అంశంపై షర్మిల ప్రభుత్వంపై తొలి పోరు చేయబోతున్నారు. తద్వారా యువతను తన పార్టీ వైపు ఆకర్షించవచ్చునని భావిస్తున్నట్లు తెలుస్తోంది.