వైఎస్ షర్మిల.. మీ అన్న జగన్తో ఆ లెక్క తేల్చిన తర్వాత మమ్మల్ని ప్రశ్నించు!!
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ను టార్గెట్ చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో నియోజకవర్గ ఎమ్మెల్యేలను నోటికొచ్చినట్లు మాట్లాడటం, విద్వేషపూరిత మైన తప్పుడు మాటలు మాట్లాడటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఒక మహిళ కదా అని ఓపిక పడుతుంటే విచ్చలవిడిగా మాట్లాడుతున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ ను సైతం టార్గెట్ చేశారు.

వైఎస్ షర్మిలకు పెద్ది సుదర్శన్ రెడ్డి సవాల్
ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సమస్యలు లేవు అని ఆయన ప్రశ్నించారు. ముమ్మాటికీ షర్మిల వెనుక కేంద్రంలోని బీజేపీ ఉందని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. నర్సంపేట నియోజకవర్గానికి వచ్చి తన వ్యక్తిత్వం గురించి మాట్లాడే హక్కు షర్మిలకు ఎక్కడిది అని ఆయన ప్రశ్నించారు. తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మీ ముందు ఉంచుతాం.. మీ ఆస్తులను కూడా ప్రజల ముందు పెట్టండి అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ఎవరి ఆస్తులు ఎంతో.. ఎవరు వేల కోట్లు సంపాదించారో తేలుతుంది అంటూ సవాల్ విసిరారు. వైయస్ షర్మిలను పాదయాత్రను తెలంగాణ ప్రజలు ఆపుతారని, ప్రభుత్వం లో ఏమైనా తప్పులు ఉంటే సబ్జెక్టు పరంగా మాట్లాడితే స్వాగతిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణాపై ప్రేమ ఉంటే మీ అన్న జగన్ తో ఆ లెక్క తేల్చు
వైయస్ షర్మిల ఇక్కడ ప్రభుత్వంపై నోటికొచ్చినట్టు మాట్లాడితే, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడాల్సి వస్తుందని, వైయస్ జగన్ ప్రభుత్వం పై మీలాగే తాము మాట్లాడతామని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందని చెబుతున్న వైయస్ షర్మిల ముందు కృష్ణా, గోదావరి నదులపై నీటి వాటా ఎంతో తేల్చమని మీ అన్న ని, బిజెపి పెద్దలను అడగండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనను అవమానించిన షర్మిల సమాధానం చెప్పాలి
గతంలో బయ్యారం గనులను అడ్డుకున్నది ఎవరో అందరికీ తెలుసని, ఆ విషయాన్ని వైయస్ షర్మిల మర్చిపోయారు అనుకుంటా అంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ ఎమ్మెల్యే ఎలా అయ్యారు అని ప్రశ్నించారు.. తాను ముమ్మాటికి రైతుబిడ్డనని పేర్కొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి, షర్మిల తనను అవమానించిన దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేల కోట్లు తాను సంపాదించానని చెప్పిన షర్మిల ప్రజల సమక్షంలో తాను ఎంత సంపాదించానో నిరూపించాలంటూ మండిపడ్డారు.

నవాబుపేట గ్రామంలోని భూముల బినామీలు ఎవరు? జెండాలు పాతుతాం
వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు తెలంగాణలో ఎందుకంటూ ప్రశ్నించిన పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వాన్ని అన్ని సమస్యలను అడిగే హక్కు ఉందని కానీ వైయస్ షర్మిలకు లేదని తేల్చి చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్యాల మండలం నవాబుపేట లో మీకు మీ భర్తకు ఎన్ని భూములు ఉన్నాయో అందరికీ తెలుసు అని పేర్కొన్న పెద్ది సుదర్శన్ రెడ్డి నవాబుపేట గ్రామంలోని భూముల బినామీలు ఎవరు? మీకు ఎక్కడివి అంటూ మండిపడ్డారు. ఆ భూములలో జెండాలు పాతడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వైయస్ షర్మిల నోరు కంట్రోల్ లో పెట్టుకొని మాట్లాడితే ఇంత గొడవ ఉండేది కాదని పెద్ది సుదర్శన్ రెడ్డి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications