గత ఎన్నికల్లో దత్తత తీసుకున్న కొడంగల్ కు కేటీఆర్ చేసిందేంటి? నిలదీసిన వైఎస్ షర్మిల
మునుగోడు ఉప ఎన్నికల బరిలో ఓట్ల కోసం రాజకీయం చేస్తున్న పార్టీల తీరుపై వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, ఓట్ల కోసం ఎన్నికల రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మునుగోడులో డబ్బులు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక మునుగోడులో గెలుపు కోసం రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మునుగోడు దత్తత.. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల
మునుగోడు ఉప ఎన్నికలలో మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసిన వైయస్ షర్మిల తనదైన శైలిలో మండిపడ్డారు. ఉప ఎన్నికలలో ఓట్లు వేస్తే మంత్రి కేటీఆర్ మునుగోడు నేను దత్తత తీసుకుంటానని చెబుతున్నాడు. అంతకుముందు మునుగోడు తెలంగాణలో లేదా అంటూ ప్రశ్నించారు వైయస్ షర్మిల. మునుగోడు అభివృద్ధి చేయాలంటే అది మీ కంటికి కనిపించలేదు అంటూ నిలదీశారు. మునుపటి ఎన్నికలలో దత్తత తీసుకున్న కొడంగల్ కు మంత్రి కేటీఆర్ చేసింది ఏంటో చెప్పాలని వైయస్ షర్మిల ప్రశ్నించారు. ఓట్లు కావలసి వచ్చినప్పుడు మీకు అభివృద్ధి గుర్తుకు వస్తుందా? వైయస్ షర్మిల నిలదీశారు.
ఓట్ల కోసమే కేసీఆర్ గారడీలు
ఇక ఓట్ల కోసమే కెసిఆర్ బయటకు వస్తాడని, గారడి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తాడని వైయస్ షర్మిల విమర్శించారు. ప్రజల సొమ్ముతో విమానం కూడా కొంటున్నాడని మండిపడ్డారు. ఒక్క కాళేశ్వరంలోనే రూ.70వేల కోట్లు దోచుకున్నాడు అని ఆరోపణలు చేసిన వైఎస్ షర్మిల దీనిపై ఢిల్లీ దాకా పోయి కొట్లాడింది వైయస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపి స్వార్థం కోసమే పనిచేస్తున్నాయని వైయస్ షర్మిల మండిపడ్డారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కొనసాగిస్తున్న వైయస్ షర్మిల ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ లో పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్న హామీపై వైఎస్ షర్మిల సూటి ప్రశ్న
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలని పేర్కొన్న షర్మిల, ఓట్లు వేస్తే వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న కెసిఆర్ చివరకు, చెరుకు సాగునే లేకుండా చేశాడు అంటూ మండిపడ్డారు. మహిళలకు స్వయం ఉపాధి, వడ్డీలేని రుణాలు కల్పించడంలోనూ విఫలం అయ్యాడని నిప్పులు చెరిగారు. మహిళల సంక్షేమానికి వైయస్సార్ తెలంగాణ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్న షర్మిల, అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల పేరు మీదనే ఇండ్లు నిర్మించి, సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరికీ స్వయం ఉపాధి కల్పించి, ఆర్థికంగా ఎదిగేలా చేస్తామన్నారు. మహిళల రక్షణకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు.