ఎన్నికలప్పుడు కేసీఆర్ డబ్బులు ఎంతిచ్చినా తీసుకోండి.. అది మీ సొమ్మే: వైఎస్ షర్మిల
ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా చాపకింద నీరులా పనిచేస్తూ పోతున్న వైయస్ షర్మిల ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అనర్గళంగా మాట్లాడుతూ, ప్రజా సమస్యలను గుర్తు చేస్తూ, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను టార్గెట్ చేస్తున్న వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు గ్రామ గ్రామాన ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తుంది.
కాంగ్రెస్, బిజెపిలు కెసిఆర్ కు అమ్ముడుపోయాయని వైయస్ షర్మిల ఆరోపణ
తాజాగా సూర్యాపేట మండలంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల పలు గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడుతూ, వారిలో చైతన్యం తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు కెసిఆర్ కు అమ్ముడుపోయాయని వైయస్ షర్మిల ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కుంటూ పోరాటం చేస్తోంది వైయస్సార్ తెలంగాణ పార్టీ అని షర్మిల పేర్కొన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేశాయని వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్లు కావాల్సినప్పుడే కెసిఆర్ బయటకు వస్తారు
కెసిఆర్ 8 ఏళ్ల పాలనలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొంటూ షర్మిల, ఎన్నికలు వస్తే కేసీఆర్ ఎంతకైనా దిగజారుతారు అంటూ మండిపడ్డారు. ఎనిమిదేండ్ల పాలనలో కేసీఆర్ ఒక్క మాట నిలుపుకోలేదు అని పేర్కొన్న వైయస్ షర్మిల ఒక్క హామీ నెరవేర్చలేదు అంటూ మండిపడ్డారు. ఓట్లు కావాల్సినప్పుడే కెసిఆర్ బయటకు వస్తారు. ఎన్నికల ముందు డబ్బులు ఇస్తారు. ఎంతిచ్చినా తీసుకోండి, అది మీ సొమ్మే అని తేల్చి చెప్పారు. ఓటు మాత్రం మీకు నచ్చిన,మీ కోసం పనిచేసే వారికే వేయండి అంటూ వైఎస్ షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కరెంట్ మంత్రి కేసీఆర్ లాగే మాయమాటలు
ధనవంతులకు దోచిపెట్టడం,పేదోడి పొట్ట కొట్టడం ఇదే కెసిఆర్ కు తెలిసిన పని అని విమర్శించారు వైయస్ షర్మిల . ఇక్కడున్న కరెంట్ మంత్రి.. కరెంట్ చార్జీలు పెంచడం, భూకబ్జాలు చేయడం తప్పితే నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ తెచ్చిన దాఖలాలు లేవు అంటూ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ని టార్గెట్ చేశారు. కెసిఆర్ లాగే మాయ మాటలు చెప్పి, ఓట్లు దండుకోవడం, గెలిచాక ముఖం చాటేయడం ఈ మంత్రికే చెల్లింది అంటూ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.
ఉన్నోడికే రైతు బంధు,లేనోడికి కన్నీరు
57 ఏండ్లు దాటిన వారికి పెన్షన్లు ఇస్తామని ఏడాదైనా తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదని వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా పాత పెన్షన్లకు ఎసరు పెట్టారు అంటూ మండిపడ్డారు. కౌలు రైతులను ఈసారైనా ఆదుకుంటారనుకుంటే ఇప్పటివరకు సప్పుడు లేదు అని పేర్కొన్న వైయస్ షర్మిల, ఉన్నోడికే రైతు బంధు,లేనోడికి కన్నీరు తెలంగాణ రాష్ట్రంలో మిగులుతుంది అంటూ వ్యాఖ్యానించారు.