రాహుల్ గాంధీకి వైఎస్ షర్మిల బహిరంగలేఖ.. భారత్ జోడో పాదయాత్ర వేళ; మ్యాటర్ ఏంటంటే!!
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కెసిఆర్ అవినీతిపై, రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన పై తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో తాజాగా భారత్ జోడో యాత్రతో తెలంగాణాలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీకి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ద్వారా వైఎస్ షర్మిల రాహుల్ గాంధీ తెలంగాణా పర్యటనలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి మాట్లాడాలని సూచించారు.
రాహుల్ గాంధీకి వైఎస్ షర్మిల లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో అవినీతి జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని లేఖ ద్వారా వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై రాహుల్ గాంధీ తన పర్యటనలో మాట్లాడాలని వైయస్ షర్మిల లేఖ ద్వారా పేర్కొన్నారు. 38 వేల కోట్ల రూపాయలతో నిర్మించవలసిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్షా ఇరవై వేల కోట్లకు ఎలా పెరిగింది? అనేది కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ప్రశ్నించాలని ఆమె పేర్కొన్నారు.
దేశంలోనే అతి పెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం
దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిందని వైయస్ షర్మిల లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఎత్తిపోతలకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలో భాగంగా రాహుల్ గాంధీ కి లేఖ రాశానని వైఎస్ షర్మిల వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్ర చేస్తున్న వేళ.. దేశంలో ఈ అతిపెద్ద కుంభకోణం గురించి మాట్లాడాలని ఆయనను కోరానని ఆమె తెలిపారు.
కాళేశ్వరం స్కామ్ 2జీ,కోల్ స్కాంలకు ఏమాత్రం తక్కువ కాదు
ఇక ఇదే సమయంలో తెలంగాణలో రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రను స్వాగతిస్తున్నాం అని పేర్కొన్నారు వైఎస్ షర్మిల . కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ మాత్రమే ప్రశ్నిస్తోందని పేర్కొన్న ఆమె ఇది 2జీ,కోల్ స్కాంలకు ఏమాత్రం తక్కువ కాదు అంటూ ఆరోపించారు.దేశంలోనే అతిపెద్ద స్కాం అయిన కాళేశ్వరం అవినీతిపై రాహుల్ గాంధీ మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి విషయంలో ఇప్పటికే ఢిల్లీ వెళ్లి మరీ వైఎస్ షర్మిల ఇటీవల కాగ్ కు ఫిర్యాదు కూడా చేశారు.