రేపు తిరుమలకు వైఎస్ జగన్: అలిపిరి మార్గంలో..కాలినడకన శ్రీవారి దర్శనం
తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలను సందర్శించనున్నారు. సోమ, మంగళవారల్లో ఆయన అక్కడే ఉంటారు. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అలాగే- పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రెండు రోజుల పాటు ఆయన తీరిక లేకుండా గడపనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.
సోమవారం మధ్యాహ్నం 1.40 నిమిషాలకు వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారు. రెండు గంటలకు ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి బయలుదేరుతారు. మూడు గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 3.30 గంటలకు శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిసేబిల్డ్ (బర్డ్) ఆసుపత్రికి వెళ్తారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్ ప్రాంగణంలో నిర్మించిన చిన్నపిల్లల గుండె జబ్బు చికిత్స ఆసుపత్రిని ప్రారంభిస్తారు. తరువాత అలిపిరికి చేరుకుని, శ్రీవారి పాదాలను దర్శిస్తారు. అలిపిరి నడక దారి, పైకప్పు, గో మందిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం నడక మార్గాన తిరుమలకు చేరుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

వైఎస్ జగన్ కాలినడకన తిరుమలను సందర్శించడం ఇది రెండోసారి అవుతుంది. ఇదివరకు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర ముగిసినను విజయవంతంగా ముగించిన తరువాత ఆయన అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో బస చేస్తారు. మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటలకు తిరిగి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. గొల్ల మండపాన్ని సందర్శిస్తారు.
హిందీ, కన్నడ భాషల్లో శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్, బూందీపోటును లాంఛనంగా ప్రారంభిస్తారు. అన్నమయ్య భవన్లో రైతు సాధికార సంస్థ, తిరుమల తిరుపతి దేవస్థానం మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లికి బయలుదేరుతారు. 11.40 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. వైఎస్ జగన్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది.
జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీలు మద్దిల గురుమూర్తి, ఎన్ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆర్ కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications