ఆనం రామనారాయణ రెడ్డిపై జగన్ చర్యలకు కారణం చెప్పిన మాజీ మంత్రి..!!
తిరుపతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడట్లేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా వ్యవహరిస్తోన్న, బహిరంగంగా వ్యాఖ్యానాలు చేస్తోన్న నాయకులను ఉపేక్షించట్లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో- పార్టీపరంగా ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వట్లేదాయన.
మంచి గురించి కాకుండా..
ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులు, అమలు చేస్తోన్న అనేక రకాల సంక్షేమ పథకాలు, నాడు-నేడు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కాకుండా తాత్కాలిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోన్న సొంత పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవడానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్. తిరుపతి జిల్లా వెంకటగిరి శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డిపై వేటు వేయడం ఇందులో భాగమే. నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని అపాయింట్ చేశారు.
స్పందించిన మాజీ మంత్రి..
ఆనం రామనారాయణ రెడ్డిపై వైఎస్ జగన్- పార్టీపరంగా తీసుకున్న చర్యలపై మాజీ మంత్రి, ఒంగోలు శాసన సభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి తాజాగా స్పందించారు. పార్టీకి ఉన్న కట్టుబాట్లను కాదని, ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసే నాయకులను నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని బాలినేని అన్నారు. గీత దాటి ప్రవర్తించిన కారణంగానే వెంకటగిరి నియోజకవర్గ నాయకత్వాన్ని మార్చాల్సి వచ్చిందని చెప్పారు. పార్టీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన వేటు తప్పదని హెచ్చరించారు.
పార్టీ ముఖ్యం..
శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి, వెంకటగిరి కోఆర్డినేటర్ రామ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కోట్లాదిమంది ప్రజలకు మేలు చేస్తోన్న ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ సారథ్యాన్ని వహిస్తోందని, అలాంటి పార్టీని ధిక్కరించడం సరికాదని బాలినేని వ్యాఖ్యానించారు. పార్టీ ముఖ్యమని బాలినేని శ్రీనివాస రెడ్డి తేల్చి చెప్పారు.
మళ్లీ గెలుస్తాం..
పార్టీ కట్టుబాట్లను ధిక్కరించిన, క్రమశిక్షణను ఉల్లంఘించిన నాయకులు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్నా వైఎస్ జగన్ సహించబోరని పేర్కొన్నారు. అలాంటి నియోజకవర్గాల్లో తక్షణ చర్యలు ఉంటాయని, అందులో భాగంగానే- వెంకటగిరిలో మార్పులు చోటు చేసుకున్నాయని వివరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేవని, వెంకటగిరిలో మళ్లీ విజయం సాధిస్తామని బాలినేని ధీమా వ్యక్తం చేశారు.
నమ్మకం నిలబెట్టుకుంటా..
అనంతరం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ- వైఎస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని, వెంకటగిరి నియోజకవర్గాన్ని వైసీపీకి కంచుకోటగా మారుస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇప్పటి నుంచే కృషి చేస్తానని చెప్పారు.