టీటీడీకి భారత్ బయోటెక్ భారీ విరాళం: కోవాగ్జిన్తో మరో మలుపు
తిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి కోలాహలం కొనసాగుతోంది. వేలాదిమంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకున్నారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొనసాగించనున్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని నిర్వహించారు. రోజువారీ కంటే ఎక్కువ మంది భక్తులకు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే సౌకర్యాన్ని కల్పించారు.

వేలాదిమంది భక్తులతో..
వైకుంఠ ఏకాదశి నుంచి వరుసగా సంక్రాంతి సెలవులు రావటం వల్ల వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీఐపీలు కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకోవడం వల్ల సామాన్య భక్తులు సకాలంలో శ్రీవారిని దర్శంచుకోలేకపోయారు. ప్రొటోకాల్ ప్రకారం.. వీఐపీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడం వల్ల క్యూలైన్లను గంటల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. ఫలితంగా పలువురు భక్తులు అసహనానికి గురయ్యారు.

తిరుమలలో ప్రముఖులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, ఏపీ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, చిత్తూరు జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రంగనాథ రాజు, ఆదిమూలపు సురేష్, అనిల్కుమార్ యాదవ్ దంపతులు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రోజా, ఎంపీ సీఎం రమేష్ దంపతులు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తెలంగాణ మంత్రి హరీష్ రావు దంపతులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

భారత్ బయోటెక్ విరాళం..
భారత్ బయోటెక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా ఎల్లా, ఆయన భార్య సుచిత్ర ఎల్లా.. వైంకుఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మొత్తంతో కూడిన చెక్ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డికి ఇచ్చారు. వెంగమాంబ నిత్య అన్నదానం కోసం ఈ విరాళాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కోవాగ్జిన్ డెవలపర్గా..
భారత్ బయోటెక్.. ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి కోవాగ్జిన్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన మొట్టమొదటి దేశీయ ఫార్మాసూటికల్స్ కంపెనీగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. కోవాగ్జిన్ను అభివృద్ధి చేసిన తరువాత ఈ హైదరాబాదీ ఫార్మా కంపెనీ దశ తిరిగిపోయింది. దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం కోవిషీల్డ్తో పాటు కోవాగ్జిన్ను వినియోగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కోవాగ్జిన్ను గుర్తించడంతో ఇది కాస్తా యూనివర్శల్ వ్యాక్సిన్ అయింది.

ప్రపంచవ్యాప్తంగా పిల్లల కోసం
దాదాపు అన్ని దేశాల్లోనూ ఇది వినియోగంలోకి రావడానికి కారణమైంది. ఈ నెల 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైన యుక్త వయస్కుల వ్యాక్సినేషన్లోనూ కోవాగ్జిన్నే వినియోగిస్తోన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల్లోపు పిల్లలకు కోవాగ్జిన్ వేస్తోన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వయస్సు పిల్లలకు కోవాగ్జిన్ వేయడానికి భారత్ బయోటెక్ అనుమతిని పొందింది. త్వరలోనే మిగిలిన దేశాల్లోనూ పిల్లలకు ఇచ్చే టీకాల కార్యక్రమంలో దీన్ని చేర్చనున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది.












Click it and Unblock the Notifications