మోడీ, అమిత్ షాలే ఈ దేశానికి కరెక్ట్: తల ఎగిరిపోతుందని తెలిసినా అంటూ పవన్ కళ్యాణ్
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన రెండో రోజు పర్యటనను కూడా తిరుపతిలో కొనసాగిస్తున్నారు. మంగళవారం జనసేన పార్టీ కార్యకర్తలతోపాటు న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తన మూలాలను ఎప్పుడూ మర్చిపోనని అన్నారు.

తల ఎగిరిపోతుందని తెలిసినా..
తనకు కష్టాలు లేవని.. సుఖమైన జీవితం నుంచి వచ్చానని తెలిపారు. సుఖమైన జీవితాన్ని వదులుకుని ఎందుకు కష్టాలు పడుతున్నావని తమ తల్లి కూడా అన్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఒక మనిషి కష్టాల్లో ఉంటే తాను కళ్లుమూసుకుని, కళ్లకు గంతలు కట్టుకుని ఉండలేనని ఆయన వ్యాఖ్యానించారు. తాను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను మాట్లాడుతుంటే.. తన తలకాయ ఎగిరిపోతుందని తెలిసినా మాట్లాడుతున్నానని అన్నారు. సమస్యలను చూస్తూ కళ్లకు గంతలు కట్టుకుని ఉండలేనని అన్నారు.

మోడీ, అమిత్ షాలే కరెక్ట్
కులాన్ని, మతాన్ని ప్రాంతాన్ని ఇష్టా రాజ్యానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వారే దేశానికి అవసరమని, కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. అమిత్ షా ఉక్కుపాదంతోనే మాట్లాడతారని అన్నారు. రాయలసీమలోకి ఎవరూ రావొద్దని దోరణితో కొన్ని గ్రూపులు ఇక్కడున్నాయన్నారు. ఎవర్ని పొడిచినా రక్తమే వస్తుందని.. తన తలకాయ ఎగిరిపోతే పర్లా అనేంత గుండె ధైర్యంతో వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

ఏడ్చిన రాత్రులున్నాయంటూ..
బీజేపీ లాంటి పెద్ద పార్టీలున్నాయని.. పెద్ద నాయకులున్నారని.. దశాబ్ధాలపాటు కొనసాగిన సంస్థాగత ఏర్పాట్లు మన పార్టీకి ఇంకా లేవన్నారు. ఇక్కడ వందమందిని కూర్చోబెడితే 150 గ్రూపులు ఉంటాయన్నారు. దేశం మీద ప్రేమతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఎంత పిచ్చి అంటే.. నిస్సహాయతతో ఏడ్చిన రాత్రులు ఉన్నాయని.. ఆ ఏడుపే తనను ఇక్కడి వరకు తెచ్చిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

పుట్టబోయే బిడ్డల కోసమే..
న్యాయం కోసం పోరాడే న్యాయవాదులున్నారని, వారందరినీ కలుపుకోలేకపోతున్నామని అన్నారు. ఒక్కోసారి ఏదైనా ఎస్టాబ్లిష్డ్ పార్టీలో ఉంటే బాగుంటుందేమోనని అనిపిస్తుంన్నారు. కానీ, కష్టంగా ఉన్నా తాను పార్టీని కొనసాగిస్తున్నానని చెప్పారు. పుట్టబోయే బిడ్డల కోసం భవిష్యత్ తరాల కోసం పనిచేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications