ఎస్వీబీసీలో పోర్న్ సైట్ లింక్..చర్యలకు డిమాండ్..బీజేపీ ఫైర్..టీడీపీ నేతల ధర్నా
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా నడిచే భక్తి చానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అప్రదిష్ట పాలవుతుంది . గతంలో చైర్మన్ గా కీలక పదవిని నిర్వహించి మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడిన కమెడియన్ పృధ్వీకి సంబంధించి బయటకు వచ్చిన రాసలీలల ఆడియో విషయంలో ఎస్వీబీసీ చైర్మన్ గా రాజీనామా చేశారు. ఇక తాజాగా ఎస్వీబీసీలో పోర్న్ సైట్ లింక్ కలకలం రేపింది. ఇది టీటీడీకి తలనొప్పిగా మారింది.
ఎస్వీబీసీ కార్యాలయం ముందు టీడీపీ ధర్నా
ఎస్వీబీసీ టీవీ ఛానల్ లో అశ్లీల సైట్ లింక్ ఇప్పుడు ఏపీలో కలకలం రేపింది. దీనిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు . ధర్మ ప్రచారానికి నిర్వహించే ఛానల్ లో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడటం దురదృష్టకరమని వారంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఛానల్ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఎస్విబిసి పవిత్రతను కాపాడాలంటూ టిడిపి నేతలు ఆందోళనకు దిగారు. టీటీడీ పవిత్రత కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారంటున్నారు .
సీరియస్ గా తీసుకున్న టీటీడీ.. చర్యలకు రంగం సిద్ధం
శతమానం భవతి కార్యక్రమం కోసం ఒక భక్తుడు మెయిల్ చేయగా తిరిగి భక్తుడికి ఎస్విబిసి ఉద్యోగి ఓ అశ్లీల సైట్ లింక్ పంపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తుడు టిటిడి చైర్మన్ కు ,ఈవో కు దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దీంతో ఎస్విబీసి ఆఫీసులో టిటిడి విజిలెన్స్ సైబర్ క్రైం అధికారులు తనిఖీలు నిర్వహించారు. లింక్ పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో అశ్లీల సైట్స్ చూస్తున్న ఐదుగురు ఉద్యోగులను గుర్తించింది సైబర్ క్రైమ్ టీం . విధులు నిర్వర్తించకుండా వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని గుర్తించిన అధికారులు సదరు ఉద్యోగులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.
Recommended Video
మండిపడుతున్న బీజేపీ నేతలు .. ప్రక్షాళన చెయ్యాల్సిందే
ఎస్వీబీసీలో పనిచేసే ఉద్యోగి పోర్న్ లింక్లు పంపటం నిజమేనని టీటీడీ విజిలెన్స్ విచారణలో తేలింది. దీంతో పోర్న్ వీడియో పంపిన ఉద్యోగితోపాటు పోర్న్ సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తుంది.
ఎస్వీబీసీలో పోర్న్సైట్లు చూడడం కొందరు ఉద్యోగులకు అలవాటుగా మారిందని , అలాంటి వారిని ఏరిపారెయ్యాలని బీజేపీ నేత రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. ఎస్వీబీసీ చానల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఉద్యోగులను వెంటనే తొలగించాలని, గతంలో ఛానల్లో అక్రమ నియామకాలు జరిగాయని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. ఛానల్ను వెంటనే ప్రక్షాళన చెయ్యాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.