చల్లారని డిక్లరేషన్ రగడ: టీడీపీ మాజీమంత్రి వినూత్న నిరసన: అలిపిరి వద్ద అనుచరులతో కలిసి
తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో అన్యమతస్తుల కోసం ఉద్దేశించిన డిక్లరేషన్ రద్దు వ్యవహారం చల్లారట్లేదు. డిక్లరేషన్ను రద్దు చేయట్లేదని, తన మాటలను వక్రీకరించారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చిన తరువాత కూడా అదే రగడ కొనసాగుతోంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలకు పాల్పడుతోందని, శ్రీవారి ఆలయ పవిత్రత మంట కలిసేలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
డిక్లరేషన్ రద్దు చేయడానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా సీనియర్ నేత, మాజీమంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి వినూత్నంగా నిరసన నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆయన తిరుపతిలోని అలిపిరి వద్ద స్వామివారికి పొర్లుదండాలు పెట్టారు. సాష్టాంగ ప్రణామాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నాని, తిరుపతి పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి అలిపిరికి చేరుకున్న టోల్గేట్ వద్ద నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.

పార్టీ నేతలతో కలిసి సాష్టాంగ ప్రణామాలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల మనసు మారాలని తాను స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఆనవాయితీగా వస్తోన్న ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా వైఎస్ జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. హిందూ దేవాలయాలపై నిరంతరాయంగా దాడులు చోటు చేసుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లే నిందితులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు.

ఇదివరకు తిరుమల ఏడుకొండలు కాదంటూ జీవోలను జారీ చేసిందని, ఇప్పుడు కూడా అదే తరహా వివాదాస్పద నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోందని అమర్నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. డిక్లరేషన్ రద్దు చేయడం వల్ల అన్యమతస్తులు తిరుమలకు ఇబ్బడిముబ్బడిగా వస్తారని, వారివల్ల ఆలయ పవిత్రత మంటకలుస్తుందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను తాము ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉంటామని చెప్పారు. డిక్లరేషన్ను వెంటనే పునరుద్ధరించాలనీ ఆయన డిమాండ్ చేశారు.
Recommended Video













Click it and Unblock the Notifications