తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - శ్రీవారి ముఖ్య సేవ పునఃప్రారంభం..!!
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. శ్రీవారి ముఖ్యసేవగా భావించే సుప్రభాత సేవ తిరిగి ప్రారంభమైంది. ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేసింది. ధనుర్మాసం పూర్తి కావటంతో తిరిగి సుప్రభాత సేవను ప్రారంభించారు. ప్రముఖలతో పాటుగా సాధారణ భక్తులు సైతం సుప్రభాత సేవలో పాల్గొనాలని కోరుకుంటారు. తక్కువ సంఖ్యలో ఈ సేవకు టీటీడీ అవకాశం కల్పిస్తుంది. ధనుర్మాసం సమయంలో నెల రోజులపాటు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను నిలిపివేసి ఆ స్థానంలో తిరుప్పావై ను నిర్వహించారు. ఇప్పుడు తిరిగి సుప్రభాత సేవ తిరిగి ప్రారంభమైంది.
శ్రీవారి సేవల్లో సుప్రభాత సేవ ప్రత్యేక మైనది. ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తం (2.30 నుండి 3.00) గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. సంప్రదాయ రీతిలో నిత్యం ఈ సేవను నిర్వహిస్తారు. ఆనవాయితీ ప్రకారం సంప్రదాయ పద్దతిలో సుప్రభాత సేవకు సిద్దమైన తరువాత సుప్రభాత సేవ కోసం రుసుం చెల్లించిన భక్తుల్ని అప్పుడు బంగారు వాకిలి వద్దకు అనుమతిస్తారు.సుదీర్ఘ కాలంగా ఆచరిస్తున్న పద్దతులకు అనుగుణంగా క్రమ పద్దతిలో సేవను నిర్వహిస్తారు. ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ సేవలో పాల్గొనటం కోసం భారీ డిమాండ్ ఉంటుంది. తాజాగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల కోసం ఎంబీసీ ప్రాంతంలో మినీ అన్నదాన సముదాయం నిర్మించాలని నిర్ణయించింది.
కాలి నడకన వచ్చే భక్తులకు ఇప్పటికే టీటీడీ మార్గమధ్యంలో అన్నదానం ఏర్పాటు చేసింది. అయితే, అన్నదాన సముదాయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలను పంపిణికి అవకాశం ఏర్పడుతుంది. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూస్తున్నామని, మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 74,436 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 27,269 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.