తిరుమల శ్రీవారి దర్శనం వేళల్లో కీలక మార్పులు - సామాన్య భక్తులకు..!!
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో శ్రీవారి దర్శనం సమయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భక్తుల విజ్ఞప్తి మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. సవరించిన వేళలు.. డిసెంబర్ 1వ తేదీ నుంచి అంటే- గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా టైమ్ స్లాట్ను మంజూరు చేయనున్నారు అధికారులు.
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా తెల్లవారు జామున 5:30 గంటలకు ఆరంభం అయ్యే వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని 8 గంటలకు మార్చారు. వీఐపీలకు కాకుండా సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని మరింత చేరువ చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రొటోకాల్, శ్రీవాణి ట్రస్ట్కు విరాళాలను అందజేసే భక్తుల కోసం వీఐపీ బ్రేక్ దర్శన సమయం స్లాట్ను కేటాయించారు.
కాగా- శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లను ఇకపై తిరుపతిలో మాత్రమే జారీ చేస్తారు. అలాగే- మాధవరం అతిథిగృహం ఆఫ్ లైన్ కౌంటర్లను కూడా తిరుపతికి తరలించారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఉన్న భక్తులు మాధవరం అతిథిగృహంలో బస చేయడానికి వీలు కల్పించారు. అక్కడ గదులను బుక్ చేసుకోవచ్చు. మాధవరం అతిథి గృహంలో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఈ ఉదయం 10 గంటలకు దీన్ని ప్రారంభించనున్నారు.
కాగా- తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 24 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. సోమవారం వేంకటేశ్వర స్వామివారిని మొత్తం 69,211 మంది భక్తులు దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 26,764 మంది స్వామివారికి తమ తలనీలాలను సమర్పించారు. మరోసారి టీటీడీకి కానుకల రూపంలో రికార్డు స్థాయి ఆదాయం లభించింది. శ్రీవారి హుండీ ఆదాయం మరోమారు అయిదు కోట్ల రూపాయలను దాటింది. హుండీ కానుకల ద్వారా 5.11 కోట్ల రూపాయలు ఆదాయం అందింది.