Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - లడ్డూ ప్రసాదం ఇక నుంచి..!!
Tirumala Laddu Prasadam: తిరుమల భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం మరింత త్వరగా భక్తులకు అందించేలా చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్న టీటీడీ..ఇక బ్రేక్ దర్శనాలతో పాటుగా ప్రసాదాల పంపిణీ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. తాజాగా తిరుమలలో వసతి గదుల అద్దె పెంపు వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి ఈవో ధర్మారెడ్డి స్పష్టత ఇచ్చారు. సామాన్య భక్తులకు కేటాయించే వసతి భవనాల అద్దెను పెంచలేదని స్పష్టత ఇచ్చారు. జనవరి 1వ తేదీ నుంచి ప్రస్తుత సంక్రాంతి సెలవుల వరకు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. ఈ నెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు తరలి వచ్చారు.
ఇప్పుడు తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ ప్రసాద కేంద్రాలను పెంచాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న లడ్డూ విక్రయ కేంద్రాలు పెరుగుతున్న భక్తుల సంఖ్యతో సరిపోవటం లేదు. చాలా సేపు లడ్డూ కోసం వేచి చూడాల్సి వస్తోంది. దీంతో, భక్తుల నుంచి వస్తున్న వినతుల మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 50 లడ్డూ కేంద్రాలు నిరంతరం ప్రసాదాలు అందిస్తున్నాయి. అయినా..ఇవి సరిపోవటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిని పరిగణలోకి తీసుకొని మరిన్ని లడ్డూ కేంద్రాలు పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న కేంద్రాలకు అదనంగా మరో 30 లడ్డూ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. వీటిని త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
వీఐపీలకు కేటాయించే 172 అతిథిగృహాల అద్దె పెంచామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేసారు. 2022లో శ్రీవారిని 2.37 కోట్ల మంది దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ 1450.41 కోట్లు లభించాయి. భక్తులకు 11.54 కోట్ల లడ్డూలు విక్రయించారు. గదుల ధరలు పెంచి సామాన్యులను టీటీడీ దోపిడీ చేస్తున్నట్లు నిరూపిస్తే ఇప్పటికిప్పుడు తన పదవికి రాజీనామా చేస్తానని ఈవో ధర్మారెడ్డి సవాల్ విసిరారు. ప్రస్తుతం సామాన్య భక్తులకు ప్రాధన్యత దక్కేలా వీఐపీ దర్శనాలు సమయ వేళల్లో మార్పు చేసారు. ఇదే విధానం మరో రెండు నెలలు కొనసాగించి..ఆ తరువాత అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది.