తిరుమలలో ఇక నుంచి..కీలక నిర్ణయం ప్రకటించిన ఈవో ధర్మారెడ్డి..!!
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. కొద్ది రోజులగా తిరుమల డ్రోన్ విజువల్స్ కు సంబంధించి వివాదం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. ఇప్పుడు ఈ వివాదంపై ఈవో ధర్మారెడ్డి స్పందించారు. డ్రోన్కి సంబంధించి ఐఓసీకి పర్మిషన్ ఇవ్వడం వాస్తవమేనని ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, అన్నదానం నుంచి డంపింగ్ యార్డు వరకు మాత్రమే అనుమతి ఉందని వివరించారు. ఐఓసీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. ఐఓసీ సిబ్బందిపై కేసు నమోదు చేశామన్నారు. డ్రోన్తో శ్రీవారి ఆలయం చిత్రికరణపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. యూట్యూబ్లో ఉన్న వీడియోను తొలగించామన్నారు. తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుకొని వస్తున్నట్లు ధర్మారెడ్డి ప్రకటించారు.
టీటీడీ భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని ధర్మారెడ్డి స్పష్టం చేసారు. పటిష్ఠమైన భద్రతా వ్యవస్థ ఉందని చెప్పుకొచ్చారు. త్వరలోనే యాంటీ డ్రోన్ టెక్నాలజీ అమలు చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో టీటీడీకి గదుల కేటాయింపుతో రూ.71.41 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. శ్రీవాణి ట్రస్టుకి రూ.10 వేలు విరాళం ఇచ్చిన భక్తులకు ఒక్కసారి బ్రేక్ దర్శనం ఇచ్చే పద్ధతిని అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా దాదాపు రూ.650 కోట్ల నిధులు సమకూరిరనట్లు వెల్లడించారు. ఈ నిధులతో 26 జిల్లాల్లో 2068 ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయని ఈవో వివరించారు. సమరత సంస్థ ఫౌండేషన్ ద్వారా ఈ ఆలయాల నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. 111 ఆలయాల పనులు పూర్తి అయినట్లు చెప్పారు.
320 ఆలయాల నిర్మాణానికి 32 కోట్ల రూపాయలను మంజూరు చేసిన అంశాన్ని వెల్లడించారు. దేవాదాయ శాఖ ద్వారా 932 ఆలయాల మరమ్మత్తులకు రూ.100 కోట్లు.. పురాతన 150 ఆలయాలకు జీర్ణోద్ధరణకూ రూ.130 కోట్లు కేటాయించామని.. రానున్న ఆరు నెలల్లో అన్ని ఆలయాల నిర్మాణాలనూ పూర్తి చేస్తామని ఈవో ప్రకటించారు. టీటీడీ ఆధ్వర్యంలో వసతి గదుల ధరల పెంపు పైనా ఆయన స్పందించారు. టీటీడీ ఆధ్వర్యంలో 396 కళ్యాణ మండపాలు ఉన్నాయని.. తిరుపతిలోని శ్రీనివాస కళ్యాణ మండపానికీ మరమ్మతులు చేశామని చెప్పారు. స్థానికుల కోరిక మేరకే ఆధునికరించి.. అద్దె ధరను పెంచామని ధర్మారెడ్డి వివరించారు. 384 కళ్యాణ మండపాల అద్దె ధరలను పెంచలేదని స్పష్టం చేసారు, తిరుమలలో ఉద్యోగులకు కేటాయించిన 850 గదుల్లో..650 గదులను వెనక్కి తీసుకొని సామాన్య భక్తులకు కేటాయిస్తున్నామని వివరించారు. శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేక అకౌంట్ ఉందని ధర్మారెడ్డి చెప్పారు.