విజయవాడలో 40 శాతం మందికి కరోనా వచ్చిపోయింది- సీరో సర్వైలెన్స్ సర్వే సంచలనం...
ఏపీ ప్రభుత్వం కరోనా ప్రభావంపై తాజాగా నిర్వహిస్తున్న సీరో సర్వైలెన్స్ సర్వే ఫలితాలు షాకింగ్గా మారాయి. ఇప్పటికే సర్వే నిర్వహించిన నాలుగు జిల్లాల్లో 8 నుంచి 20 శాతం వరకూ జనం తమకు తెలియకుండానే కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నట్లు వెల్లడి కాగా ఇప్పుడు నగరాల వారీగా వెలువడుతున్న ఫలితాలు మరింత ఆందోళన కలిగించాయి. అదే సమయంలో ఊరట కూడా ఇస్తున్నాయి. తాజా ఫలితాల్లో విజయవాడలోని 40 శాతం మందికి పైగా జనానికి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే కరోనా సోకింది, తగ్గిపోయిందని తేలింది.

సీరో సర్వైలెన్స్ సర్వే ఫలితాలు..
కరోనా ప్రభావం మొదలయ్యాక ప్రజల్లో పెరుగుతున్న రోగనిరోధకశక్తిని తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న సీరో సర్వైలెన్స్ సర్వే ఏపీలో నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించారు. ఇందులో కృష్ణా, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో సగటున 8 శాతం నుంచి 20 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని, అది వారికి తెలియనే లేదని ఇప్పటికే నిర్ధారణ అయింది. కృష్ణాజిల్లాలో 20 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని తేలింది. అయితే ఇందులో నగరాల వారీగా వెలువడుతున్న ఫలితాలు మరింత షాకింగ్గా ఉన్నాయి.

బెజవాడలో 40 శాతం మందికి...
తాజాగా నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వేలో బెజవాడలో 40 శాతం మందికి కరోనా వచ్చిపోయిందని తేలింది. వీరికి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే కరోనా సోకడం, తగ్గిపోవడం జరిగిపోయింది. తమకు కరోనా వచ్చినట్లు ఈ 40 శాతం మందికి తెలియనే తెలియదు. దీంతో వీరు ఎంచక్కా జనంలో కలిసి పోయి తిరిగేస్తున్నారు. లక్షణాలు కనిపించకపోవడంతో మిగతా వారు కూడా వీరితో కలిసిపోతున్నారు. తాజాగా నిర్వహించిన రక్త పరీక్షల్లో ఈ విషయం తేలింది. నగరంలో మరో 3.3శాతం మంది అనుమానిత లక్షణాలతో పరీక్షలు చేయించుకున్నట్లు తెలిసింది.

విజయవాడలో ఈ ప్రాంతాల్లో సర్వే...
విజయవాడలో కరోనా ప్రభావం ఎక్కువగా కనిపించిన కృష్ణలంక, రాణిగారి తోట, దుర్గాపురం, రామలింగేశ్వరనగర్, మధురానగర్, ఎన్టీఆర్ కాలనీ, గిరిపురం, లబ్బీపేట, పటమట, ఆర్ఆర్పేట, లంబాడీపేటలో నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. విజయవాడ రూరల్లోని కానూరు, గొల్లపూడి, చిన్న ఓగిరాల, గొల్లపల్లిలో సీరో సర్వైలెన్స్ సర్వే నిర్వహించారు. ఇక్కడ తీసుకున్న రక్త నమూనాలు పరీక్షించినప్పుడు ఇప్పటివరకూ కరోనా సోకలేదని ధైర్యంగా ఉన్న వారిలో 40 శాతం మందికి వైరస్ సోకడం, తగ్గిపోవడం కూడా జరిగిపోయింది, ఆ మేరకు వారి శరీరాల్లో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు సర్వేలో గుర్తించారు.

విజయవాడలో కరోనా తగ్గుముఖం..
రాష్ట్రవ్యాప్తంగా కరోనా ప్రభావం ఇంకా కనిపిస్తున్నా విజయవాడలో మాత్రం భారీగా తగ్గుతోంది. కృష్ణాజిల్లా రెండు వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల జాబితాలో చివరి స్ధానంలోనే ఉంటోంది. తాజా హెల్త్ బులిటెన్లోనూ రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1399 కేసులు నమోదు కాగా.. కృష్ణా జిల్లాలో కనిష్టంగా 281 కేసులు మాత్రమే నమోదు కావడం పరిస్ధితికి అద్దం పడుతోంది. ఈ ప్రభావం విజయవాడలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికీ విజయవాడలో రోజుకు దాదాపు 100 కేసులు నమోదవుతున్నట్తు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో కరోనా మరింత తగ్గనుందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.












Click it and Unblock the Notifications