బీజేపీ కోర్కెలు తీర్చేస్తున్న జగన్- కాషాయ నేతల్లో ఉత్సాహం- అసలు వ్యూహమిదేనా.. !
ఏపీలో గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉప్పూ నిప్పులా సాగుతున్న బీజేపీ-వైసీపీ సంబంధాలు ఇప్పుడు కాషాయ పార్టీలో అధికార మార్పిడి తర్వాత కొత్త పుంతలు తొక్కుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న పలు సమస్యల పరిష్కారం కోసం జగన్ సర్కారు తాజాగా తీసుకుంటున్న వరుస నిర్ణయాలు సొంత పార్టీలో సైతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే దీని వెనుక మరో వ్యూహం కూడా ఉండి ఉండొచ్చన్న చర్చ కూడా సాగుతోంది. అదే నిజమైతే 2024 ఎన్నికలే టార్గెట్గా జగన్ రూపొందిస్తున్న భారీ వ్యూహానికి ఇవి తొలి అడుగులుగానే చెప్పవచ్చు.

బీజేపీ డిమాండ్లను నెరవేరుస్తున్న జగన్...
గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్షంలో ఉన్న బీజేపీ పలు డిమాండ్లను తెరపైకి తెచ్చింది. అయినా వీటిపై ఎప్పుడూ జగన్ సర్కారు స్పందించింది లేదు. కానీ తాజాగా మాత్రం వైసీపీ సర్కారు వరుస పెట్టి అవే డిమాండ్లను నెరవేర్చే పనిలో పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పేదల బతుకులను చిదిమేస్తున్న ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి క్రీడలపై నిషేధం విధించాలని బీజేపీ ఎప్పటి నుంచో కోరుతోంది. అలాగే ప్రమోషన్లు లేకుండానే రిటైర్ అవుతున్న ఎండీవోలను డీడీవోలుగా ప్రమోట్ చేయాలని కూడా కోరుతోంది. అన్నింటికీ మించి టీటీడీలో ఆర్ధిక వ్యవహారాలను కాగ్ పరిధిలోకి తీసుకురావాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఎప్పటినుంచో కోరుతున్నారు. వీటిపై ఇప్పటివరకూ వైసీపీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎక్కడా చర్చ లేదు.

కేబినెట్ నిర్ణయాలతో బీజేపీ ఖుష్..
తాజాగా ఏపీ కేబినెట్ బీజేపీ గతంలో ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న రెండు సమస్యలకు పరిష్కారం చూపించింది. కేబినెట్ తీసుకున్న ఆ నిర్ణయాలు ఇప్పుడు బీజేపీలో ఎక్కడలేని సంతోషం నింపుతున్నాయి. వీటిలో మొదటిది ఆన్లైన్ జూదంపై నిషేధం. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గతంలో పలుమార్లు ఇదే అంశంపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు లేఖలు కూడా రాశారు. అలాగే ఎండీవోలకు ప్రమోషన్లపై అధ్యక్ష పదవి చేపట్టకముందే సోము వీర్రాజు పలుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయినా వీటిపై అప్పట్లో స్పందించని వైసీపీ నేతలు, ప్రభుత్వ వర్గాలు.. ఇప్పుడు మాత్రం వారిని మెప్పించడమే లక్ష్యంగా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ తాజా నిర్ణయాలపై బీజేపీ నేతలు సోమువీర్రాజు, విష్ణు వరుస ట్వీట్లతో ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు.

టీటీడీపై కీలక నిర్ణయం..
ఏపీలో ప్రభుత్వశాఖలూ, విభాగాలది ఓ ఎత్తయితే టీటీడీ వ్యవహారాలు మరో ఎత్తు. ఇక్కడ జరిగే ప్రతీ వ్యవహారంపైనా అందరి కన్నూ ఉంటుంది. టీటీడీలో అక్రమాలపై గతంలో బీజేపీ ఎన్నో పోరాటాలు కూడా చేసింది. అయినా ప్రభుత్వాలు వీటి విషయంలో నామమాత్రంగా స్పందించేవి. ముఖ్యంగా టీటీడీలో ఆర్ధిక వ్యవహారాలు ఎవరికీ అంతు పట్టవనే పేరుంది. దీంతో టీటీడీని కూడా కాగ్ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా గతంలో పలుమార్లు ఇదే విషయాన్ని జగన్ దృష్టికి తన ట్వీట్లు, డిమాండ్ల ద్వారా తీసుకెళ్లారు. కానీ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీటీడీ బోర్డు పంపిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు తెలియడంతో స్వామి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు.

టీడీపీ స్ధానంలో బీజేపీ- జగన్ వ్యూహమిదే...
ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీడీపీ 23 స్ధానాలకే పరిమితమైంది. బీజేపీ అయితే పోటీ చేసిన అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది. అయితే టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి జై కొట్టారు. దీంతో ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేస్తూ వార్తల్లో నిలిచేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఆ పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు. టీడీపీ చేస్తున్న డిమాండ్లను ఒక్కదాన్నీ పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ డిమాండ్లను నెరవేర్చే పనిలో పడింది. తద్వారా బీజేపీనే తాము విపక్షంగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. బీజేపీ కూడా ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తున్నట్లు చెప్పుకుంటోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే 2024 ఎన్నికల నాటికి టీడీపీ స్ధానంలో బీజేపీ ప్రధాన విపక్షంగా అవతరించడం ఖాయం. అయితే టీడీపీతో పోలిస్తే బలమైన క్యాడర్ లేని బీజేపీ ఎంత ప్రయత్నించినా అధికారంలోకి మాత్రం రాలేదని సీఎం జగన్కు కూడా తెలుసు. దీంతో బీజేపీని ప్రోత్సహించడం ద్వారా టీడీపీని నిర్వీర్వం చేసేందుకు దొరికిన అవకాశాన్ని వైసీపీ వినియోగించుకుంటన్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications