ఏపీ సీఎం కీలక నిర్ణయం: కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15వేలు, ఆస్పత్రులకు వార్నింగ్
అమరావతి: కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్.. మంత్రులు, అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని సీఎం ఆదేశించారు.
Recommended Video

క్వారంటైన్ కేంద్రాల నాణ్యత తప్పనిసరి..
ఈ సందర్భంగా కరోనా పరీక్షలు, కేసుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఫీడ్బ్యాక్ కోసం రోజూ క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రులకు కాల్స్ చేయాలని సీఎం జగన్ సూచించారు. క్వారంటైన్ కేంద్రాల పారిశుద్ధ్యం, భోజనంపై దృష్టి సారించాలన్నారు. ఆయా కేంద్రాలపై వారంపాటు డ్రైవ్ చేయాలని అధికారులకు జగన్ ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాల నాణ్యతపై దృష్టిపెట్టని అధికారులకు నోటీసులు ఇవ్వాలని సీఎం జగన్ అన్నారు.

కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15వేలు..
కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 15వేలు ఇవ్వాలని ఆదేశించారు. అంతేగాకుండా కరోనా పరీక్షలకు శాశ్వత కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.
ఎస్ఓపీ ప్రకారం కరోనా పరీక్షలు చేయాలని, ఎవరికి పరీక్షలు చేయాలన్న దానిపై స్పష్టమైన ప్రోటోకాల్ ఉండాలని సీఎం ఆదేశించారు. పరీక్షలు చేయాల్సిన వారి కేటగిరీలను స్పష్టంగా తెలపాలని సీఎం చెప్పారు. 17వేల మంది వైద్యులు, 12వేల మంది నర్సులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కరోనా కేసు వస్తే ఏ ఆస్పత్రీ చికిత్స నిరాకరించకూడదని, ఒకవేళ అలా చేస్తే ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేస్తామని సీఎం హెచ్చరించారు.

కరోనా ఫలితాల్లో జాప్యం వద్దు..
కాగా, రాష్ట్రంలో కరోనా పరీక్షల ఫలితాలు జాప్యమవుతున్న ఘటనలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వీఆర్డీఎల్, ట్రూనాట్ ల్యాబుల్లో నమూనా సేకరణ కౌంటర్ల ఏర్పాటుకు ఆదేశించింది. ఈ కౌంటర్లు 24 గంటలూ పనిచేయాలని సంయుక్త కలెక్టర్లకు ఆదేశించింది. నమూనా ఫలితాలు వచ్చాక కరోనా పోర్టల్లలో నమోదు చేయాలని సూచించింది. రెడ్మార్క్ నమూనా గల ఫలితాలు త్వరగా ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాక, కరోనా రోగికి మళ్లీ పాజిటివ్ వస్తే దానిని కొత్త కేసుగా పరిగణించవద్దని తెలిపింది. కాగా, ఏపీలో ఇప్పటి వరకు 33,019 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 408 మంది మరణించారు. 15,144 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications