ఆ ఇద్దరు అధికారులకు రిటర్న్ గిఫ్ట్: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు: నెక్స్ట్ ఎవరు..!
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రబాబు కోర్ టీంగా వైసీపీ విమర్శించే ఇద్దరు కీలక పోలీసు అధికారులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. డీజీపీగా సవాంగ్ను నియమించిన కొత్త ప్రభుత్వం..మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వేంకటేశ్వర రావుకు ఎక్కడా పోస్టింగ్ లేకుండా బదిలీ చేసింది. ఇక, కీలకమైన ఆర్దిక శాఖ బాధ్యతలు రావత్కు అప్పగించిన ప్రభుత్వం..సాల్మన్ ఆరోక్య రాజ్ను సీఎంఓలోకి తీసుకుంది.
డీజీపీగా సవాంగ్..ఆ ఇద్దరిపైన వేటు
ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజే సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల ముందు నుండి వైసీపీ డీజీపీ ఠాకూర్..ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వేంకటేశ్వర రావు మీద ఆగ్రహంతో ఉంది. దీంతో..వారిద్దరినీ ప్రస్తుతం ఉన్న పోస్టుల నుండి తప్పించింది. డీజీపీగా ఠాకూర్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా(డీజీపీ) పూర్తి అదనపు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతారు. ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్, పర్ఛేజ్ కమిషనర్గా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న కుమార్ విశ్వజిత్ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఏడీజీగా బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును వేరొక పోస్టులో నియమించే వరకు పోలీస్ హెడ్క్వార్టర్స్కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆ ఇద్దరికి రిటర్న్ గిఫ్ట్..
ఎన్నికల ముందు నుంచి డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుల తీరు పైన వైసీపీ చాలా రోజులగా ఆరోపణలు చేస్తోంది. పోలీసు అధికారులుగా కాకుండా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వీరిద్దరూ పనిచేశారనే విమర్శలు చేసింది. వారు ఆయా పోస్టుల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరిగే అవకాశం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ పోస్టు నుంచి బదిలీ చేయడంతోపాటు ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని ఈసీ ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ పోస్టు నుంచి తప్పించేందుకు చంద్రబాబు ససేమిరా అన్నప్పటికీ కోర్టు జోక్యంతో తప్పనిసరి అయ్యింది. ఖాళీ అయిన ఏసీబీ డీజీ పోస్టులో ఏబీ వెంకటేశ్వరరావును చంద్రబాబు సర్కారు నియమించింది. ఇప్పుడు ఆయనకు జగన్ ప్రభుత్వం ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
సీఎంఓలోకి ఇద్దరు అధికారులు..
ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఇద్దరు అధికారులను నియమించారు. సీఎంఓ అదనపు కార్యదర్శిగా ధనుంజయ రెడ్డి, కార్యదర్శిగా సాల్మన్ ఆరోక్య రాజ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రావత్కు కీలకమైన ఆర్దిక శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఆ పోస్టులో రవిచంద్ర ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు నిర్ణయాలనే అమలు చేసారనే ఫిర్యాదు ఉంది. ఇక, ముఖ్యమంత్రి కార్యాలయంలోకి మరో ఇద్దరు అధికారులను నియమించే అవకాశం ఉంది. అందులో పీవీ రమేష్ .. జవహర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి ఓఎస్డీగా కృష్ణ మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. మిగిలిన కీలక శాఖల్లోనూ కీలక అధికారుల నియమాకం జరగనుంది.