స్వర్ణప్యాలెస్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు- రమేష్ కు ఊరట- తదుపరి చర్యల నిలుపుదల...
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం కేసులో హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. తమపై ఏపీ పోలీసులు దాఖలు చేసిన కేసులను సవాల్ చేస్తూ రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు రూపొందించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఎఫ్ఐఆర్పై స్టే విధించింది. అంతే కాకుండా రమేష్ ఆస్పత్రిపైనా, ఛైర్మన్ రమేష్ బాబుపైనా తదుపరి చర్యలను నిలిపివేసింది.
ఈ నెలలో విజయవాడ స్వర్ణప్యాలెస్ కోవిడ్ కేర్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో పది మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. స్వర్ణప్యాలెస్లో రమేష్ ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ పోలీసులు రమేష్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ రమేష్ బాబుతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రమేష్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు ఉద్యోగులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. వీరు ప్రస్తుతం మచిలీపట్నం జైల్లో ఉన్నారు.

స్వర్ణప్యాలెస్ ఘటనలో అగ్నిప్రమాదంపై స్పందించిన హైకోర్టు.. అసలు ఈ హోటల్లో కోవిడ్ కేర్ సెంటర్కు అనుమతిచ్చిన కృష్ణాజిల్లా కలెక్టర్, హోటల్ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్తో పాటు జిల్లా వైద్యాధికారిని ఎందుకు బాధ్యులు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. డాక్టర్ రమేష్ తరఫున మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. స్వర్ణప్యాలెస్ ను రమేష్ ఆస్పత్రి లీజుకు తీసుకోకముందే వందేభారత్ మిషన్ కింద విదేశాల నుంచి చేరుకున్న ప్రయాణికులకు పెయిడ్ క్వారంటైన్గా ప్రభుత్వం వాడుకుంది. ఇదే విషయంపై హైకోర్టు ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications